Sakshi News home page

బదిలీలకు రంగం సిద్ధం!

Published Sat, Jun 7 2014 3:27 AM

Ready to Transfers

జిల్లా పోలీస్‌శాఖలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు రంగం సిద్ధమైంది. దీంతో పోస్టింగ్‌ల కోసం అధికారులు నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమకు నచ్చిన స్టేషన్‌లో అవకాశం కోరుతూ పైరవీలు మొదలుపెట్టారు. రాజధాని స్థారుులో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.   
 
 జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న 180 మందికిపైగా కానిస్టేబుళ్ల ఉద్యోగకాలం పూర్తకావడంతో వారికి బదిలీలు తప్పనిసరైంది. ఇప్పటికే బదిలీలకు అవకాశమున్న వారు తమకు నచ్చిన మూడు పోలీస్‌స్టేషన్లు ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు ర్యాండమ్‌గా గ్రామీణ పోలీస్‌స్టేషన్లు, నగర పోలీస్‌స్టేషన్లలో పనిచేయాలి. ఎక్కువగా రూరల్ ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావితప్రాంతాల్లో పనిచేసిన వారికి నగరాల్లో పనిచేసే అవకాశముంది. అయితే కొన్నేళ్లుగా జరుగుతున్న బదిలీల్లో రూరల్‌లో పని చేసేవారు మరో రూరల్ ప్రాంతానికి బదిలీలు జరుగుతుండగా.. నగరాల్లో పనిచేస్తున్న వారు ఇక్కడే పాతుకుపోతున్నారు.
 
  ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వారు ఇక్కడే కానిస్టేబుల్‌గా చేరి ఇక్కడే ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారూ ఉన్నారు. సుమారు 15 ఏళ్లుగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుతూ జిల్లా కేంద్రంలోనే  పాతుకుపోతున్నారు. వీరు స్టేషన్లలో కీలకంగా మారి నాయకులు, అధికారులకు అన్ని పనులు చక్కబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా బదిలీలు చేయకుండా అక్కడే ఉంచడం.. బదిలీ చేసినా అటాచ్డ్ పేరుతో మళ్లీ నగరానికి చేరడం పరిపాటిగా మారింది.
 
 తీరు మారని అధికారులు..
 ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు జరిగాయి. అయితే గతంలో మాదిరిగా మార్పిడి విధానంలో కాకుండా జంబ్లింగ్ పద్ధతిలో బదిలీలు చేశారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పలువురు అధికారులు మళ్లీ జిల్లాకు రావడానికి వారికి ఉన్న పరిచయాలతో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, అధికారులు పైరవీలకు పెద్దపీట వేసి సమర్థులైన పలువురు అధికారులను లూప్‌లైన్ పోస్టింగ్‌లకు పంపించారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం పలువురు ఎస్సైల బదిలీలు జరిగాయి. వీరిలో చాలామంది వీఆర్, అప్రాధాన్యత పోస్టులు, వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక ప్రస్తుతం బదిలీలకు రంగం సిద్ధం చేశారని తెలుసుకున్న పలువురు అధికారులు నాయకులతో అనుకున్న స్థానానికి బదిలీ చేయించుకునేందుకు యత్నిస్తున ్నట్లు తెలిసింది. తాజాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో గతంలో పని చేసినట్లుగా పైరవీలకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులు పనితీరు కంటే నాయకుల ప్రసన్నం చేసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
 పోస్టు కోసం పోటాపోటీ..
 కరీంనగర్ సబ్‌డివిజన్‌లో ఉన్న ఓ పోలీస్‌స్టేషన్ పోస్టింగ్ కోసం 8మంది ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే డివిజన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌కు 12మంది వరకు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. సీఐల పోస్టింగ్ కోసమైతే ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారితోపాటు జిల్లాలోని పలువురు సీఐలు రాజధాని స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. గతంలోనూ ఇదే విధంగా పైరవీలకు పెద్దపీట వేయడంతో పలువురు సమర్థవంతమైన అధికారులు విధిలేని పరిస్థితుల్లో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైరవీలకు పెద్దపీట వేయకుండా పనితీరుకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
 
 నివేదికలు సిద్ధం
 పలువురు నాయకులు కొత్తగా ఎన్నిక కావడం.. కొత్తరాష్ట్రం కావడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు సేవచేయాలంటే పలువురు సమర్థులైన అధికారులు అవసరం. దీంతో పలువురు నాయకులు అధికారులకు సంబంధించి సమాచారంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీని ఆధారంగా బదిలీలు చేయాలని కోరుతున్నారని తెలిసింది.
 
 ఉన్నతాధికారులు కూడా...
 ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కూడా జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓఎస్డీ సుబ్బారాయుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లిపోతుండగా.. మరో ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు ముగ్గురు డీఎస్పీలు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. అయితే వీటికి సంబంధించి స్పష్టత మరో పదిరోజుల్లో వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ పెద్ద ఎత్తు బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఉంది.
 

Advertisement
Advertisement