అగ్గి రాజుకుంటే బుగ్గే | Sakshi
Sakshi News home page

అగ్గి రాజుకుంటే బుగ్గే

Published Tue, Dec 2 2014 1:49 AM

అగ్గి రాజుకుంటే బుగ్గే - Sakshi

బహుళ అంతస్తుల్లో భద్రత కరువు
‘ఫైర్’ అనుమతి లేకుండా వెలుస్తున్న భవంతులు  
కంటికి కన్పించని ఫైర్ సేఫ్టీ పరికరాలు  
కాసులిస్తే కన్నెత్తి చూడని అగ్నిమాపక అధికారులు

సాక్షి, మంచిర్యాల : బహుళ అంతస్తులు నిర్మించారా..? భవంతుల్లో రక్షణ చర్యలు లేవా..? ఫైర్‌సేఫ్టీ పరికరాలూ లేవా..? అయినా.. ఆందోళన వద్దు.. ‘దక్షిణ’ సమర్పించండి చాలు. మీ జోలికి ఎవరూ రారు. పరిస్థితి సీరియస్ అ యినప్పుడే.. నామమాత్రంగా నోటీసులిస్తాం. స్పం దించకున్నా పర్వాలేదు. తర్వాత మళ్లీ ‘మామూలు’ పరిస్థితే...! ఇలా అగ్నిమాపక శాఖాధికారులు వ్యవహరిస్తు న్న ఈ తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న భవంతులు అగ్నిమాపక శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. రక్షణ చర్యలు చేపట్టాలంటే.. రూ.1.50 లక్ష నుంచి రూ.3 లక్షల పైనే (అంతస్తులను బట్టి) ఖర్చవుతుంది. అదంతా అదన పు ఖర్చని భావించే నిర్వాహకులు క్షేత్రస్థాయిలో అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు.

అగ్నిమాపక అధికారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దక్షిణ సమర్పించుకుంటున్నారు. అనుకోకుండా ఏదై నా అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని సాకుగా చూపి తనిఖీల పేరిట మళ్లీ మిగతా భవనాల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మా రింది. ఇటీవల మంచిర్యాల పట్టణంలో ఓ బహుళ అంతస్తులో అగ్ని భద్రత పరికరాలు లేకపోవడంతో సదరు యజమాని అగ్నిమాపక అధికారులకు ‘మాములు’ సమర్పించుకున్నాడు. అంతే కాదూ.. ఇతర ప్రాంతాల నుంచి తనిఖీ అధికారులు రావాలన్నా సదరు బిల్డింగ్ యజమాని రవాణా ఖర్చులూ భరించాల్సిందే.
 
తలొగ్గిన అధికారులు..
జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లో బహుళ అంతస్థులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా బిల్డర్లు.. పారిశ్రామికవేత్తలు.. వైద్యులు ఆగమేఘాల మీద భవనాలు నిర్మించేస్తున్నారు. జిల్లాలో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు వేలాది సంఖ్యలో ఉన్నా అగ్నిమాపక శాఖ అనుమతితో కొనసాగుతున్నవి పదుల సంఖ్యలోనే.

భవంతుల్లో ఫైర్‌సేఫ్టీ పరికరాలున్నాయా..? లేవా..? చూసి అనుమతి ఇవ్వాల్సిన అగ్నిమాపక శాఖాధికారులు బిల్డర్లు, వ్యాపారులకు తలొగ్గారు. అనుమతి లేకుండా, కనీస అగ్ని భద్రత (ఫైర్‌సేఫ్టీ) పరికరాలు లేకుండా కొనసాగుతున్న ఆస్పత్రులు, విద్యా సంస్థలు, లాడ్జింగ్‌లపై కన్నెత్తి చూడ్డం లేదు. కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఈ విషయంలో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్‌లింగం స్పందిస్తూ.. భవంతుల్లో రక్షణ చర్యలు చేపట్టని నిర్వాహకులకు కోర్టు నోటీసులు ఇస్తామన్నారు.
 
కానరాని రక్షణ చర్యలు..!
అగ్ని ప్రమాదం జరిగితే.. ఫైరింజన్ సంఘటనా స్థలం వెలుపలికి వెళ్లి మంటలార్పే విధంగా ద్వారం ఉండాలి. కనీసం భవంతి చుట్టూ వాహనం సునాయసంగా తిరిగే స్థలం ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఆ పై అంతస్తులు (జి+) కలిగి ఉంటే ఇసుక, నీళ్ల బకెట్లు.. ఫైర్ ఎక్స్‌టెన్షన్స్.. డ్రై కెమికల్ పౌడర్ ఏర్పాటు చేసుకోవాలి. సినిమా థియేటర్లు.. లాడ్జీలు.. కల్యాణ మండపాలు.. గిడ్డంగులు.. ఆస్పత్రులు.. విద్యాసంస్థల్లో డౌన్ కామర్, ఓబీ రీల్, హైజెంట్ సిస్టమ్స్ కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి.

అనుమతి పొందిన తర్వాత ప్రతి ఏడాదికి సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలి. విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, లాడ్జీలు, ఆస్పత్రులు మీటరుకు రూ.10 చొప్పున రుసుము చెల్లించాలి. సినిమా థియేటర్ల యజమానులైతే ఏడాదికి రూ.10 వేలు చెల్లించి అగ్నిమాపక శాఖతో రెన్యువల్ చేసుకోవాలి. కానీ.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు.
 
శాఖల మధ్య సమన్వయ లోపం...!
జిల్లావ్యాప్తంగా నిర్మిత మైన.. నిర్మితమవుతోన్న భవంతుల విషయంలో ముందుగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. ఈ శాఖ ఇచ్చిన నో ఆబ్జెక్షన్ (ఎన్‌వోసి) సర్టిఫికెట్ చూసిన తర్వాతే  మున్సిపల్, రెవిన్యూ అధికారులు సమ్మతించాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. అధికారులు తమ అనుమతి లేకుండానే భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తున్నారని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement