రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.. | Sakshi
Sakshi News home page

రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్..

Published Wed, Oct 15 2014 2:21 AM

రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.. - Sakshi

పొలమే ఇల్లయితంది..
నా పేరు రాయిడి చిన్నయ్య. మాది సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం. నాకు మూడెకరాల వ్యవసాయం ఉంది. ఇందులో ఒక బోరుబావి ఉంది. ఈ ఏడాది పత్తి, మిర్చి పంటలు సాగుచేశాను. పొద్దున పంటపొలానికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికి వస్తున్నం. భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి కరెంటు ఇవ్వడంతో పొలానికి వెళ్లిపోతున్నం. రాత్రింబవళ్లు పంటపొలంలోనే గడపాల్సి వస్తంది. రాత్రిపూట పొలంగట్ల వెంబడి నడుస్తుంటే పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. అయినా ప్రాణాలు లెక్కచేయకుండా పంటలకు నీరందిద్దామంటే ఇచ్చే కరెంటులో తరచూ కోతలు విధిస్తున్నరు.
 
సాగుకు దిగింది మొదలు.. దిగుబడి వచ్చి.. పంట అమ్ముకునే వరకూ రైతన్న పరిస్థితి దయనీయం. ఆరు గాలం.. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంటు కోతలు విధి స్తుండడం.. రాత్రిల్లో సరఫరా చేస్తుం డడంతో రైతుల పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. సాగు సమరంలో రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్..
 
బోర్ల వద్దే జాగారం
కుంటాల : వరుస కష్టాలతో అన్నదాత ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలకు తోడు కరెంట్ కష్టాలు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం సాగవుతున్న పంటలకు తగినంత వర్షం లేక.. విద్యుత్ మోటార్ల ద్వారా పంటలను కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు కారు చీకట్లో నిద్రాహారాలు మాని చేళల్లోనే జగారాం చేస్తున్నారు. కాలం కలిసిరాక కరెంట్ కష్టాలు తోడై ప్రభుత్వ సహాయం అందక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ఎక్కడ అమలు కావడంలేదు.

సోమవారం  కుంటాల సబ్‌స్టేషన్‌నుంచి అధికారికంగా మూడు గంటలు కరెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా వెంకూర్ ఫీడర్‌కు గంట, ఓలా ఫీడర్‌కు రెండు గంటలు, అంబకంటి ఫీడర్‌కు రెండున్నర గంటలు, దౌనెల్లి ఫీడర్‌కు రెండు గంటల పది నిమిషాలు మాత్రమే సరఫరా చేశారు. కరెంట్ వస్తుందనుకున్న వెంకూర్, ఓలా, విఠాపూర్, కుంటాల, అంబకంటి, దౌనెల్లి గ్రామాల రైతులు సోమవారం రాత్రి సెల్‌ఫోన్లు, టార్చి లైట్లు పట్టుకుని పంట పొలాల వద్దకు వెళ్లి నిద్రించారు. అయినా గంట కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో బోరు బావుల వద్దే నిద్రించారు. వెంకూర్ గ్రామానికి చెందిన రైతులు అదే రాత్రి కోతలపై కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ సరఫరా చేయకపోవడంతో చేతికొచ్చిన పత్తి, సోయా, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
రాత్రి వేళల్లో కరెంటు తిప్పలు
చెన్నూర్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కరెంటు కోసం రాత్రి అనక పగలనక కంటి మీద కునుకు లేకుండా రైతులు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. జైపూర్ మండలంలోని దుబ్బపల్లికి చెందిన కామెర లింగయ్య అనే రైతు రూ.60 వేలు ఖర్చు చేసి రెండు ఎకరాల వరి పొలాన్ని సాగు చేశాడు.

వర్షాలు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. పగలంతా కరెంటు సరఫరా లేకపోవడంతో రాత్రి ఏ సమయానికైన కరెంటు వస్తే పొలానికి నీరు పెట్టుకునేందుకు టార్చిలెట్ పట్టుకొని పొలం కూర్చున్నారు. కరెంటు కోసం కంటి మీద కునుకు లేకుండా నెల రోజులుగా రాత్రిళ్లు పొల ం వద్దే ఉంటున్నానని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది లింగయ్య ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. నియోజకవర్గంలోని రైతులందరిది. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రతి రోజు కనీసం సక్రమంగా 5 గంటలైనా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
 
భయపడుతూనే పొలాలకు...
సారంగాపూర్ : నాపేరు లక్ష్మారెడ్డి నాకు సారంగాపూర్ గ్రామ సమీపంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు వేయించాను. ఈసారి పత్తి, సోయా పంటలు పండిస్తున్నాను. అయితే వ్యవసాయానికి రెండు వారాలకోసారి రాత్రిపూట కరెంటు ఇస్తున్నరు. రాత్రి రెండు గంటలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందని తెలిస్తే దానికి గంట ముందే పంట పొలాలకు వెళ్తున్నం. తెల్లవార్లు పంటలకు నీరందిస్తుండగా దాదాపు రెండుమూడు సార్లు కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నరు. దీంతో అటు నీరందక, ఇటు నిద్ర పాడుచేసుకుంటున్నం. దీంతో పాటు రాత్రి పంటలకు నీళ్లందించడానికి పొలం గట్ల వెంబడి నడుస్తున్నపుడు పురుగు పుట్ర చూసి భయపడుతున్నం. వ్యవసాయానికి రాత్రిపూట కరెంటుకు బదులు పగటిపూట ఇస్తే బావుంటది.

 - లక్ష్మారెడ్డి, రైతు, సారంగాపూర్

అడవిపందుల బెడద ఉంది
సారంగాపూర్ : మాది సారంగాపూర్ మండలం జామ్ గ్రామం. నాకు గారమ శివారంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఈ ఏడాది కూరగాయలు, పత్తి పంటలు పండిస్తున్నాను. అయితే ప్రతి రెండు వారాలకోసారి వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చే స్తున్నరు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 వ రకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో భ యంతో వణికిపోతున్నం. రాత్రివేళ కరెంటు ఇవ్వడంతో అర్ధరాత్రి లేచి పొలాలకు వెళ్తుండగా దారిపొడవునా అడవిపందులు సంచరిస్తున్నా యి. దీంతో రాత్రివేళ పంటలకు నీరందించడానికి వెళ్లాలంటేనే భయం గా ఉంటుంది. ఒకసారి నాద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడవిపందు లు రోడ్డుకు అడ్డుగా రావడంతో కింద పడ్డాం. మోటారు వద్ద ఏదైనా సమస్య వస్తే కరెంటు తీగలు సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురవాల్సి వస్తోంది.     

- కరిపె ప్రభాకర్, రైతు, జామ్, సారంగాపూర్

Advertisement
Advertisement