రైతులపై విత్తన భారం | Sakshi
Sakshi News home page

రైతులపై విత్తన భారం

Published Wed, Aug 23 2017 1:38 AM

రైతులపై విత్తన భారం - Sakshi

శనగ, వేరుశనగ విత్తన ధరలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్‌:
యాసంగిలో సరఫరా చేసే విత్తనాలను తక్కువ ధరకు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ మార్కెట్‌ ధరలకంటే అధిక రేటుకు విక్రయించేందుకు పూనుకుంది. శనగ, వేరుశనగ విత్తనాల ధరలను భారీగా పెంచింది. మంగళవారం ఈ మేరకు వచ్చే యాసంగికి 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 1.33 లక్షల క్వింటాళ్ల శనగ,1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేయనున్నారు.

బహిరంగ మార్కెట్‌లో శనగల ధర క్వింటాలుకు రూ.6,100 వరకు ఉండగా, వ్యవసాయ శాఖ శనగ విత్తనాలను రూ.8,680కు ఖరారు చేసింది. ఇందులో 33 శాతం సబ్సిడీ రూ.2,865 పోను రూ.5,815 రైతులు చెల్లించాలని తెలిపింది. శనగలను విత్తనాలుగా ప్రాసెసింగ్‌ చేసేందుకు క్వింటాలుకు రూ.వెయ్యి అదనం అనుకున్నా రూ.7,100కు మించి కాదని నిపుణులు అంటు న్నారు. అంటే అదనంగా రూ.1,500కు పైనే ఖరారు చేశారు. మార్కెట్‌ ప్రకారం చూస్తే 33 శాతం సబ్సిడీతో రూ.4,757కే ఇచ్చే అవకాశముంది.

వేరుశనగ ధర మార్కెట్‌లో క్వింటాలు రూ.5 వేలే. కానీ శాఖ రూ.7,600 ఖరారు చేసింది. వాటికి 40 శాతం సబ్సిడీ రూ.3,040 పోను రూ.4,560 రైతు చెల్లించాలి. వేరుశనగలను ప్రాసెసింగ్‌ చేసేందుకు రూ.వెయ్యి అదనం అనుకున్నా రూ.6వేలకు మించి ఉండాల్సిన పనిలేదు. కానీ రూ.1,600 అదనంగా ఖరారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్ధసారథి, కమిషనర్‌ జగన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement