వెతలు తీరుతాయా? | Sakshi
Sakshi News home page

వెతలు తీరుతాయా?

Published Thu, Sep 4 2014 2:46 AM

shortage of employees in medical college

నిజామాబాద్ అర్బన్: మెడికల్ కళాశాలలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కళాశాల పనితీరు, వైద్యసేవలలో అంతరాయాలు ఏర్పడుతున్నా యి. రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎనిమిదంతస్థుల అందమైన ఆసుపత్రి ఉన్నప్పటికీ సేవలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.  సిబ్బంది నియామకా లు జరుగకపోవడంతో కళాశాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఆటంకాలు ఎదురయ్యాయి.

 ఇదీ పరిస్థితి
 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అనంతరం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి  ఉన్నతాధికారులు పరిశీలన జరి  పారు. మొత్తం 400 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించారు. వీరి నియామకం కోసం 2012 జూన్ ఏడున అప్పటి ప్రభుత్వం జీఓ నం.150 విడుదల చేసింది. కళాశాల ప్రిన్సిపాల్, పరిపాలన విభాగానికి సంబంధించి 50 పోస్టులను మంజూరు చేసింది. ఆసుపత్రిలో 189 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి లభించింది.

ఈ నియామకలను తక్షణమే చేపడతారని భావించినా, తీవ్ర జాప్యం జరిగింది. 2013 డిసెంబర్ ఆరున ప్రభుత్వం జీఓలో మార్పులు చేస్తూ 810 పోస్టులతో కూడిన కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఇందులో 210 మంది స్టాఫ్‌నర్సులు, 114 మంది వైద్యులు, 63 మంది పారా మెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది 76, మరిన్ని పోస్టులను జత చేశారు. ఇందులో 240 పోస్టులను వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ద్వారా నియమించాలని పేర్కొన్నారు. దీనికి 2014 జనవరి రెండున ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. అయినా నియామకా లు జరుగలేదు. ఈలోగా సాధారణ ఎన్నికల కోడ్ అమలులోకి వచిచంది. రాష్ట్రం ఏర్పడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేటి వరకు నియామకాల జాడ మాత్రం లేదు.

 వేధిస్తున్న ఖాళీలు
 కళాశాలలో ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కళాశాల ఏర్పడిన అనంతరం రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రికి 400కు పైగా అవుట్‌పేషెంట్‌లు వస్తున్నారు. ఇన్‌పేషెంట్‌లు 250 వరకు ఉన్నారు. సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. 220 మంది స్టాఫ్‌నర్సులు అవసరం కాగా, 80 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.

నాల్గవ తరగతి ఉద్యోగులు 180 మంది అవసరం కాగా, 21 మంది మాత్రమే ఉన్నారు. 120 మంది వైద్యులు అవసరం కాగా, 33 మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. నియామకాలు జరుగకపోవడం, అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పొతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, ఆత్మహత్య ప్రయత్నాలకు సంబంధించిన కేసులకు అత్యవసర సేవలు అందడం లేదు.
 
 నేడు ఉన్నతాధికారుల సమావేశం
 డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) డిప్యూటీ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్, వైద్య విధాన పరిషత్ జాయింట్ సెక్రటరీ అనురాధ గురువారం జిల్లాకు రానున్నారు. మెడికల్ కళాశాలలో వివిధ పోస్టులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల నుంచి అప్షన్లను స్వీకరించనున్నారు. కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. వైద్య విధాన పరిషత్‌లో సుమారు 400 మంది ఉద్యోగులు ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు.

అన్ని విభాగాల ఉ ద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆసక్తి గల ఉద్యోగులు కళాశాలకు వస్తే ఎంపిక చేస్తారు. ఇందుకోసం కళాశాలలో ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.
  శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వైద్య విధాన పరిషత్ కమిషనర్, డీఎంఈ అధికారులు భేటీ కానున్నారు. సీఎంతో చర్చించి నియామకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కళాశాల అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement
Advertisement