సర్వేపై అవగాహన కల్పించాలి | Sakshi
Sakshi News home page

సర్వేపై అవగాహన కల్పించాలి

Published Sat, Aug 9 2014 12:48 AM

should be awareness on survey

నిర్మల్  : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ నెల 19న చేపట్టే సర్వే రోజు వారంతా ఇంట్లోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో శుక్రవారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సమగ్ర కు టుంబ సర్వేపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.

 కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సర్వేల ద్వారానే ఒక ప్రాంతం అభివృద్ధిని సరిగా అంచనా వేయవచ్చని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలంతా ఆ రోజున ఇంట్లో నే ఉండేందుకు ప్రభుత్వం సెలవు సైతం ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ సెలవు ఉం టుందన్నారు. ఈ సర్వేలో ప్రజలంతా తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

 సర్వే సందర్భంగా ప్రతీ వ్యక్తి వద్ద బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, భూముల పట్టాదారు పాస్‌బుక్, ఎల్పీజీ పాస్‌బుక్, పింఛన్‌దారులైతే పింఛన్ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల్లో దండోరా లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19వ తేదీ కంటే ముందు ఒక డెమో సర్వే చేయాలని చెప్పారు. సమగ్ర సర్వే కోసం జిల్లాలో సు మారు 30 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. వారికి త్వరలోనే డివిజన్ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు.

11న ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. సర్వే విధులు నిర్లక్ష్యం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎమ్మెల్యే అల్లోల ఇం ద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ డివిజన్‌లో సుమా రు 10 వేల మంది గల్ఫ్, ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారని,  సర్వే సందర్భంగా స్వగ్రామాల్లో వారి వివరాలనూ రికార్డు చేయాలన్నారు. ఆర్డీవో జల్ద అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్ రా థోడ్, మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

 ఆదిలాబాద్‌లో..
 ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ప్రతీ ఎన్యుమరేటర్ 25 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో సేకరిస్తాడని పేర్కొన్నారు. సర్వే కోసం ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సింగరేణి, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. పనులు, విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలు వెళ్లినవారి వివరాలు నమోదు చేయరాదని చెప్పారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సర్పంచులు, గ్రామాధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement