వేయి గ్రంథాలను వెలుగులోకి తెస్తాం | Sakshi
Sakshi News home page

వేయి గ్రంథాలను వెలుగులోకి తెస్తాం

Published Sun, Nov 2 2014 11:52 PM

should be provide thousand texts :sri  tridandi ramanuja chinajiyar swamy

శ్రీరామనగరం (శంషాబాద్ రూరల్): దేశ సం సృ్కతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి వేయి పురాతన గ్రంథాలను వెలుగులోకి తీసుకురానున్నట్లు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో నెలకొల్పనున్న ‘సమతామూర్తి శ్రీమద్రామనుజ స్ఫూర్తి’ కేంద్రం నిర్మాణం సందర్భంగా ఆదివారం ఇక్కడ విద్వాంసులతో సదస్సు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది విద్వాంసులు హాజరైన ఈ సదస్సులో జీయర్‌స్వామి పలు మార్గదర్శకాలు చేశారు.

భగవద్రామానుజులు ఆవిర్భవించి వేయి సంవత్సరాలు కానున్న సందర్భంగా 2016-17లో జీవా ప్రాంగణంలో స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో 216 అడుగుల ఎత్తు శ్రీరామానుజుల లోహపు మూర్తిని నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.

స్ఫూర్తి కేంద్రంలో శ్రీరామానుజుల సంచలనాత్మకములు, స్ఫూర్తిదాయకములు, ఆయన జీవిత విశేషాల దర్శనము, 108 సుప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశాలు ఒకే చోట దర్శనమిచ్చేలా సుమారు రూ.400 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వెయ్యి గ్రంథాలను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

పుస్తకరూపం, ఈ-లైబ్రరీ, ప్రసార మాధ్యం ద్వారా గ్రంథాలను వెలుగులోకి తేవడానికి చేపటా ్టల్సిన చర్యలపై సదస్సులో చర్చించారు. ముంబై, మైసూరు, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, పూరి, మధురాంతకం, హైదరాబా ద్ ప్రాంతాల నుంచి విద్వాంసులు సదస్సులో తమ అభిప్రాయాలను తెలియజేశారు. శ్రీ అహోబిల జీయర్ స్వామి, సుప్రసిద్ధపండితులు రఘునాథాచార్యులు,  సదస్సులో పాల్గొన్నారు.

 స్ఫూర్తి కేంద్రం నమూనా ప్రదర్శన..
 జీవా ప్రాంగణంలో నెలకొల్పనున్న స్ఫూర్తి కేంద్రం నమూనాను ఇక్కడి వేద పాఠశాల విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు. స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేయనున్న వివిధ నిర్మాణాల నమూనాలను అందంగా తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను చినజీయర్ స్వామి అభినందించారు.

Advertisement
Advertisement