అందరి చూపు  గ్రామాలపైనే..! | Sakshi
Sakshi News home page

అందరి చూపు  గ్రామాలపైనే..!

Published Mon, Apr 1 2019 8:33 PM

Show The Leaders Of All Parties In Villages - Sakshi

సాక్షి, నేలకొండపల్లి: ఎన్నికల ప్రచారం అంటేనే ప్రచార హోరు. మైకుల జోరు, ర్యాలీలు. మద్యం జోరు... సాగుతుంది. కాని నియోజకవర్గంలోని వాతావారణం ఎక్కడా కానరాటం లేదు. ఎక్కడా ప్రచార హోరు కనిపించటం లేదు. మైకుల మోత మోగటం లేదు. ర్యాలీల మాటే లేదు. మద్యం మందుబాబులు కనిపించటం లేదు. కాని నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం మాత్రం సడిచప్పుడు లేకుండా సాగుతుంది. పార్లమెంట్‌ అభ్యర్ధులుగా బరిలో నేతలు వారి అనుచరగణం మొత్తం గ్రామాలపై ప్రధాన దృష్టి సారించారు. మరి గ్రామాల్లో ప్రచార హోరు కానవస్తుందా అంటే అదీ లేదు. కేవలం అభ్యర్ధుల ప్రధాన అనుచరులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసి వస్తున్నారు. 

నేతల్లో కనిపించని ఉత్సాహం.. 
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామాల్లో నేతల్లో కూడ ఎన్నికల ఉత్సాహం కనిపించటం లేదు. ఇటు టీఆర్‌ఎస్, ఆటు కాంగ్రెస్‌ ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ప్రచార బాధ్యతలను కూడ ఆయా గ్రామాల్లో నాయకులకు అప్పగించలేదు. అభ్యర్ధులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులకు ఆయా పార్టీ సర్పంచ్‌లకు అప్పగించటంతో వారు గ్రామాల్లో సందడి చేయటం లేదు. ఎక్కడ బయటకు వెళ్లితే ఖర్చుల భారం మీదపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మైకుల హోరు... ర్యాలీలు నిర్వహించటం లేదు. సాదాసీదాగా అయా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో సమావేశం అవుతున్నారు. మొత్తం మీద సడిచప్పుడు కాకుండా ప్రచారం మమ అనిపిస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో ఎక్కడా ఎన్నికల వాతావరణం కనిపించకపోవటం విశేషం. 

ఇంకా కొద్దిరోజులే... 
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 9 రోజులే మిగిలింది. ఏప్రిల్‌ 11 న జరగనున్న ఎన్నికల కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ను పూర్తి చేసింది. ఈ నెల 8 వరకు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంది. 9, 10 తేదీల్లో తాయిలాల పంపిణీపై దృష్టి సారిస్తారు. పాలేరులో 104 గ్రామపంచాయతీల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు తాయిలాలు అందిస్తారా లేదా అనే విషయం పల్లెల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయా గ్రామాలో ఉన్న నాయకుల ఇళ్ల చుట్టే కార్యకర్తలు, ఓటర్లు తిరుగుతున్నారు. ఏది ఏమైనాప్పటీకీ గ్రామాల్లో ప్రచారం సడిచప్పుడు కాకుండా జరుగుతుంది. 

కుల సంఘాల వారీగా సమావేశాలు.. 
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామల్లో కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ లు కుల సంఘాల నాయకులకు వారు కొరిన కోర్కెలకు హమీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హమీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

పాలేరులో వివిధ గ్రామాల్లో కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మెత్తం మీద ప్రచార హోరు లేకుండా గ్రామాల్లో ప్రతీరోజు ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.   

Advertisement
Advertisement