స్మార్ట్‌సిటీ కార్యాచరణ | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌సిటీ కార్యాచరణ

Published Wed, Jan 31 2018 2:28 PM

smart city works will start soon in karimnagar says comissioner - Sakshi

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులను త్వరలో ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.శశాంక తెలిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల టెండర్లకు ప్రణాళిక తయారుచేసి దశలవారీగా పనులు చేపట్టి పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ ఆర్వీ అసోసియేషన్‌ కన్సల్టెన్సీ బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్వీ కన్సల్టెన్సీ బృందంతో సమావేశమయ్యారు. ఏరియా బేస్‌డ్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మొదటి దశలో చేపట్టే ప్రాజెక్టు పనులపై చర్చిస్తూ వివరణ కోరారు. స్టేజ్‌–1, 2ను పరిగణనలోకి తీసుకుని స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. 


కరీంనగర్‌ కార్పొరేషన్‌ : స్మార్ట్‌ పనులకు సంబంధించి ప్రాజెక్టు టెండర్లపై సలహాలు, సూచనలు చేశారు. ఏరియా డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి ముఖ్యమైన లొకేషన్‌ను ముందస్తుగా గుర్తించాలన్నారు. స్టేజ్‌–1లో చేపట్టబోయే సోలార్‌ రూప్‌టాప్, స్మార్ట్‌ ఎనర్జీ, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్‌రోడ్స్, అండర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్, టూరిజం ఇన్ఫర్మేషన్, మానేరు రివర్‌ఫ్రంట్, హరితహోటల్, గ్రీనరీఅండ్‌పార్కులు, పార్కింగ్‌ ప్లేస్, మల్టీపర్పస్‌స్కూల్స్‌ అభివృద్ధిపై చర్చించారు. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం సంబంధిత ప్రాజెక్టు పనుల టెండర్ల వివరాలు, పనులను ప్రారంభించి పూర్తిచేసే విధానంపై కన్సల్టెన్సీ సభ్యుల వివరణ కోరారు. నగరంలో నడుస్తున్న మొదటి దశ రూ.100 కోట్ల పనులు, రెండోదశ రూ.147 కోట్ల పనులపై సలహాలు సూచనలు చేశారు. స్మార్ట్‌సిటీ పనులను ఏరియాల వారీగా గుర్తించి ముఖ్యమైన పనులను ముందస్తుగా చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. మరో వైపు స్టేజీ–2లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కూరగాయల మార్కెట్లు, హ్యాకింగ్‌ వెండర్‌ జోన్స్, మార్కెట్‌యార్డు రీ డిజైనింగ్‌లో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సిగ్నల్‌ సిస్టమ్, జీబ్రాక్రాసింగ్, కెమెరా కనెక్షన్స్, హెల్త్‌సెంటర్ల ఏర్పాటు,  24 గంటల మంచినీటి సరఫరాతోపాటు తదితర అంశాలపై వివరించారు. జిల్లాలో సంబంధిత అధికారుల సహకారాలతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ శరత్‌బాబు, ఆర్వీ కన్సల్టెన్సీ బృందం సభ్యులు పాల్గొన్నారు.


రూ.147 కోట్ల ప్రతిపాదనలు అందించాలి
నగరంలో రెండోవిడతలో చేపట్టే రూ.147 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఒక్కరోజులోనే సిద్ధం చేయాలని శశాంక ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్యశాఖ, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మిషన్‌భగీరథ పనులపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. యూజీడీ పనులకు సంబంధించిన ట్రంక్‌లైన్, ఐకాన్స్, ఇన్స్‌పెక్షన్‌ చాంబర్ల వివరాలను అందించాలన్నారు. పనులు చేపట్టే ముందు ఏయే ప్రదేశాల్లో ఇన్స్‌పెక్షన్‌ చాంబర్లు వేయాలో ప్లానింగ్‌ చేయాలని సూచించారు. మిషన్‌భగీరథ పనుల పురోగతిని వివరించాలన్నారు. జూన్‌ 10లోపు మిషన్‌భగీరథ పనులు ఓ కొలిక్కి వచ్చేలా పనుల్లో వేగవంతం పెంచాలని సూచంచారు. సమావేశంలో ఎస్‌ఈ శరత్‌బాబు, ఈఈ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement