బలపడతారా! | Sakshi
Sakshi News home page

బలపడతారా!

Published Sun, Nov 16 2014 2:26 AM

బలపడతారా! - Sakshi

సంస్థాగత నిర్మాణంపై బీజేపీ కసరత్తు
{పత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నం
భారీ సభ్యత్వ సేకరణ లక్ష్యంగా ముందుకు
పార్టీ జిల్లా  కార్యాలయంలో నేడు వర్క్‌షాప్
పరిశీలకులుగా ఇంద్రసేనా, ధర్మారావు
 కమలనాథులు గ్రూపులు వీడుతారా?

 
టీఆర్‌ఎస్ హవాతో పాటు, తెలుగు దేశం పార్టీతో పొత్తు కారణంగా సాధారణ ఎన్నికలలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కొంతమంది నేతలు రాజకీయ ఉపాధిని వెతుక్కుంటూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీనే పట్టుకుని ఉన్న నేతలలో, కేడర్‌లో నిరాశ గూడు కట్టుకుంది. మరోవైపు గ్రూపు విభేదాలు పార్టీని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం సంస్థాగత నిర్మాణం పై దృష్టిసారించడంతో పలు అంశాలు చర్చకు వస్తున్నాయి.
 -సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
 
సాధారణ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ ప్రయత్నం ఫలించలేదు. ఆఖరి నిముషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యంగా మారింది. దీం తో పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ బీజేపీ నాయకుల ఆశలు అడియాసలయ్యాయి. ఏళ్ల తరబడి ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల్లో లక్షల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించిన నేతల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పొత్తులలో భాగంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నాలుగు చోట్ల పోటీ చేసే అవకాశం దక్కినా.. టీడీపీ నేతలు సహకరించకపోగా, టీఆర్‌ఎస్ హవాలో ఓటమి తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, జిల్లా నాయకుల్లో నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఈ తరుణంలో కమలనాథుల మధ్యన ఉన్న అంతర్గత కలహాలు సైతం ఆ పార్టీ కేడర్‌ను అయోమయంలో పడేశాయి. చాలా రోజుల తర్వాత ఆ పార్టీ అధిష్టానం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించింది. భారీ సభ్యత్వ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఆది వారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న వర్క్ షాప్‌నకు పరిశీలకులుగా ఎన్.ఇంద్రసేనారెడ్డి, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు హాజరవుతున్నారు.

బీజేపీ నేతలు గడ్డం ఆనందరెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తదితరులు కొందరు గ్రూపులతో పని లేకుండా పార్టీయే పరమావధిలా వ్యవహరిస్తున్నారన్న పేరుండగా, మరి కొం దరు సీనియర్ల మధ్యన ఇంకా గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (భాయిసాబ్), బాణాల లక్ష్మారెడ్డి, గోపాల్, మల్లేశ్‌యాదవ్ తదితరులు ఒక గ్రూపుగా, జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీ నివాస్, లోక భూపతిరెడ్డి తదితరులు మరో గ్రూపుగా ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా భారీగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా అధిష్టానం ముం దుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వర్క్‌షాపు నిర్వహిస్తుండగా పార్టీ వర్గాలలో పలు అం శాలు చర్చనీయాంశంగా మారాయి.

బాల్కొండ నుంచి సునీల్‌రెడ్డి టికెట్ ఆశిం చారు. అక్కడ అప్పటి ఆర్మూరు ఎమ్మెల్యే అ న్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డికి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కింది. దీంతో సునీల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  ఆర్మూర్ నుంచి టికెట్ ఆశించిన ఆ పార్టీ సీ నియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆలూరు గంగారెడ్డి తదితరులకు పొత్తు లు నిరాశ కలిగించాయి. టీజాక్ నే త రాజారామ్‌ను టీడీపీ రంగంలోకి దింపడంతో బీజేపీ కేడర్ అసంతృప్తికి గురయ్యింది.
  బోధన్ నుంచి సర్వసన్నద్ధమైన కెప్టెన్ కరుణాకర్‌రెడ్డికి పొత్తులతో టికెట్ రాకుండా పోయింది. దాదాపుగా నాలుగైదేళ్లుగా పార్టీ నిర్మాణం, పటిష్టత కోసం పనిచేసిన ఆయనకు ఆఖరి నిముషంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం అశనిపాతంగా మారింది. పొత్తులలో భాగంగా టీడీపీ నుంచి మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ దక్కింది.  

నిజామాబాద్ అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేయడంతో, బీజేపీ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. బీజేపీ అభ్యర్థికి టీడీపీ శ్రేణులు అసలే సహకరించకపోగా, చీటికి మాటికి ఆయనను ఇబ్బందులకు గురి చేశారన్న ప్రచారం కూడా జరిగింది.  
 
నిజామాబాద్ రూరల్ నుంచి గడ్డం ఆనందరెడ్డి గత కొంతకాలంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేశారు. పొత్తులు ఉంటాయా? ఉం డవా? అనే అంశం నామినేషన్ల చివరి రోజు నాటికి తేలలేదు.  పార్టీ ఆఖరి నిముషంలో ఆనందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. కాగా ఎన్నికలలో ఫలితం లేకుండాపోయింది, మిగ తా నాలుగు నియోజకవర్గాల లోనూ ఇదే పరి స్థితి ఎదురు కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అయోమమంలో పడ్డారు. నిరాశ నిస్పృహలకు గురయ్యారు.
 
‘వర్క్‌షాప్’ను  విజయవంతం చేయండి

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి వర్క్‌షాపును ఆదివారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. సభ్యత్వ సేకరణ, పునర్‌నిర్మాణం, పటిష్టతపై ఇందులో చర్చ జరుగుతుంది. రాష్ట్ర నాయకులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మార్తినేని ధర్మారావు తదితరులు హాజరవుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజ యవంతం చేయాలని కోరుతున్నాం.
 - పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 
 

Advertisement
Advertisement