చోరీ వాహనాన్ని గుర్తించేందుకు రూపొందించిన ప్రత్యేక యాప్ ఇది
రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులకు యాప్ సౌకర్యం
సాక్షి, సిటీబ్యూరో: చోరీ అయిన వాహనం రాష్ట్రంలో ని ఏ మూల రోడ్డు ఎక్కినా పోలీసులకు చిక్కడం ఖాయం... అలాంటి ఒక అస్త్రం బుధవారం పోలీసు శాఖ అమ్ముల పొదిలో చేరింది. అదే..స్టొలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం (ఎస్వీటీఎస్) మొబైల్ యాప్. ఈ యాప్ను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మీడియా సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘హైదరాబాద్లో చోరీకి గురైన వాహనాలు ప్రస్తుతం 4500 వరకు ఉన్నాయి. ఒక చోట చోరీ చేసిన వాహనాలను మరో చోట దర్జాగా నడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో వాహనాల తనిఖీ సమయంలో వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో కేవలం చలానా విధించి వదిలేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా ఇక నుంచి పాత పద్ధతులకు స్వస్తి పలుకుతారు. తనిఖీల సమయంలో వాహనదారుడి వద్ద డాక్యుమెంట్లు ఉన్నా.., లేకపోయినా రిజిస్ట్రేషన్, ఇంజిన్, ఛాసిస్ నెంబర్లను పోలీసులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లోని ఎస్వీటీఎస్ మొబైల్ యాప్లో ఎంటర్ చేస్తారు.
అలా చేయగానే క్షణాల్లో ఆ వాహనం చోరీ అయిందా? లేదా అనే విషయం తెలిసిపోతుంది. ఈ యాప్ చోరీ వాహనాలను వెంటనే పట్టుకొనేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఎస్వీటీఎస్ను ట్రాఫిక్, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ విభాగాల పోలీసు అధికారులకు అందిస్తాం. రాష్ట్రంలోని ఎస్ఐ ఆపై స్థాయి అధికారి సెల్ఫోన్కు ఈ యాప్ను సమకూర్చుకునే సదుపాయం కల్పిం చాం. ఈ రోజు వరకు చోరీ అయిన వాహనాల వివరాలన్నీ సర్వర్లో నిక్షిప్తం చేశాం.
ఉదాహరణకు హైదరాబాద్లో చోరీ అయిన వాహనం అదిలాబాద్లో తిరిగినా అక్కడి పోలీసు అధికారి ఈ యాప్ను ఉపయోగించి పట్టుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా రెండు ఉపయోగాలున్నాయన్నారు. ఒకటి చోరీ వాహనాన్ని గుర్తించడం, రెండోది చోరీ అయిన వాహన వివరాలు యాప్లో పెట్టడం’’ అని అన్నారు. సమావేశంలో అదనపు సీపీలు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పాల్గొన్నారు.
డేటా సేకరణలో ఐటీ సెల్...
సర్వర్లో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీ అయిన వాహనాల వివరాలు మాత్రమే పొందుపర్చా రు. సైబరాబాద్తో పాటు మరో తొమ్మి ది జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన చోరీ వాహనాల వివరాలను ఐటీ సెల్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు వివరాలు పంపాల్సిందిగా కోరారు.