సకలం బంద్ | Sakshi
Sakshi News home page

సకలం బంద్

Published Fri, May 30 2014 2:13 AM

Telangana bandh success

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం బంద్ విజయవంతమైంది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వచ్చే ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. దీంతో గురువారం ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. టీఆర్‌ఎస్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.

దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సింగరేణి కార్మికులు గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బస్సులు డిపోల నుంచి కదలలేదు. పెట్రోల్‌బంక్‌లు మూసి ఉంచారు. బ్యాంకు లావాదేవీలు నిలిచాయి. సినిమా హాళ్లు, ఇతర సంస్థలు బంద్ పాటించాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌శాఖ ఉద్యోగులు బంద్‌కు మద్దతిచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌తో ఆర్టీసీకి రూ. 55 లక్షల నష్టం వాటిల్లింది.

 నిరసనల హోరు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్త లు వీధుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ ఆదిలాబాద్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆ శాఖ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీవీవీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై దహనం చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వరంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

 ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణమైంది. ఆర్టీసీ బస్సులు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదా యాలు మూసి ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వాంకిడిలో అంతర్రాష్ట్ర రహదారిపై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో తహశీల్దార్  కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

 బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి.
 
బెల్లంపల్లి నియోజకవర్గంలోని బజార్ ఏరియా, కాల్‌టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు జనాలు లేక బోసిపోయాయి. మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య సిబ్బంది విధులు బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. కాసిపేట గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

 చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేశారు.

 ఖానాపూర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కొరుతూ టీఆర్‌ఎస్ నాయకులు ఉట్నూర్ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

 ముథోల్ నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు మూసి ఉంచారు.
నిర్మల్ నియోజకవర్గంలో తెలంగాణ బంద్ విజయవంతమైంది నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జేఏసీ నా యకులు, టీఆర్‌ఎస్ నాయకులు వేరువేరుగా ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు. టీఎన్‌జీఓ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement