6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు | Sakshi
Sakshi News home page

6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Published Thu, Feb 20 2020 2:22 AM

Telangana Budget 2020 Assembly Session May Starts From March 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్‌ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరిగే అవకాశం ఉంది.

మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 12 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నారు. మార్చి 22లోపు బడ్జెట్‌ సమావేశాలు ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 సెప్టెంబర్‌ 9 నుంచి 22 వరకు జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాల్లో శాసనసభ 11 రోజులు సమావేశం కాగా, శాసనమండలిలో మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి.

Advertisement
Advertisement