‘పోలీసు’ పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

‘పోలీసు’ పదోన్నతులకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌

Published Sat, Oct 7 2017 7:50 PM

Telangana CM KCR green signal to police promotions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎట్టకేలకు పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో అనేక దఫలుగా చర్చలు జరిపి ఒకే సారి ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఎఎస్పిలుగా, డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతీ పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు.

 275 మంది డీఎస్పీలకు, నాన్‌కేడర్‌ ఎస్పీలు, ఏఎస్పీలుగా పదోన్నతలు కల్పించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా సీఎం కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతులపై పోలీసులు, న్యాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. 1994 బ్యాచ్‌ వరకూ అందరు పోలీసు అధికారులకు పదోన్నతి లభించింది. 139మంది సీఐలకు, డీఎస్పీలుగా, 103మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా, 33మంది ఏఎస్పీలకు నాన్‌కేడర్‌ ఎస్పీలుగా ప్రమోషన్‌ లభించింది. కాగా వరంగల్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్లకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా పోలీసు పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని చాలామంది అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పలువురికి వినతులు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమస్యను పరిష్కరించి, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సీఐలకు డీఎస్పీలుగా, 103 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా, 33 మంది ఏఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 1994 బ్యాచ్ వరకు ఉన్న పదోన్నతి కోసం వేచి చూస్తున్న సీఐలందరికీ పదోన్నతి లభించనుంది. పదోన్నతులు కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

పోలీసు అధికారుల పదోన్నతిపై ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు  పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఈటెల  రాజేందర్,  ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు  రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్పి.సింగ్, డిజిపి అనురాగ్  శర్మ,  అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, సిఎంఒ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, హోం సెక్రటరీ  రాజీవ్ త్రివేది,  సిటి సిపి మహెందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సి కొండా మురళి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు పోలీసు అధికారుల పదోన్నతి అంశంపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. ‘అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అలాంటి న్యాయం జరగలేదు. వివక్ష చూపారు. దీనివల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. జోన్ల వారీగా నియామకాలు జరిగినప్పటికీ రాష్ట్ర స్థాయి కేడర్ కు పదోన్నతి కల్పించే సందర్భంలో జోన్ల నిష్పత్తి పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు. గతంలో ఇన్‌స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు ప్రమాషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలి.  అన్యాయాన్ని సరిదిద్దాడానికి అవసరమైనచోట సూపర్ న్యూమరి పోస్టులను ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల వరంగల్ జోన్లో ఇన్స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చు’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement