ఉద్యోగుల ‘విభజన’ వెతలు | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ‘విభజన’ వెతలు

Published Tue, Mar 27 2018 2:39 AM

Telangana Employees Facing problems In Andhra pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరిగి రెండేళ్లు గడిచినా తెలంగాణ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1,300 తెలంగాణ ఉద్యోగులు, అధికారులు రాష్ట్రానికి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడాల్సి వస్తోందని అక్కడ ఉన్న 800 మంది నాలుగో తరగతి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

కౌంటర్‌ దాఖలు ఏదీ? : ఏపీకి కేటాయించిన వైద్యారోగ్య శాఖ అధికారుల్లో చాలా మంది విభాగాధిపతి కార్యాలయాలు, ఇతర శాఖల్లో కీలక స్థానాల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారని.. వీరు మంత్రుల పేషీల్లోనూ ఉండటంతో తమ కు అన్యాయం జరుగుతోందని తెలంగాణ అధికారులు వాపోతున్నారు. ఏపీకి కేటా యించినా కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని కొనసాగుతున్నవారికి ఉన్నతాధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కౌంటర్‌ దాఖలు చేయకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేషీలోని అధికారి తెలంగాణ ఉద్యోగులపట్ల వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు. పోలీసు శాఖ లోనూ తాత్కాలిక విభజన జరిగినా కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. దీనిపైనా కౌంటర్‌ దాఖలు చేయక అవి కూడా ఆగిపోయాయి. కౌంటర్‌ దాఖలు చేయకుండా భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు ముట్టజెప్పినట్లు ఆరోపణలొస్తున్నాయి.  

సీఎస్‌ల స్థాయిలోనూ: ఏపీలో తెలంగాణ స్థానికత గల అధికారులు 1,300 మంది, తెలంగాణలో ఏపీ స్థానికత గలవారు 2,200 మంది ఉన్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌ల స్థాయిలో జరిగిన చర్చల్లో ఏపీలో ఉన్నవారిని తెలంగాణకు పంపేందుకు ఏపీ ప్రభు త్వం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణలో కీలకస్థానాల్లో ఉన్న 2,200 మందిని ఏపీకి తీసుకోవాలని సూచించగా (తెలంగాణవారికి కీలకస్థానాలు లభిస్తాయని) అం గీకరించలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది.

Advertisement
Advertisement