బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి

Published Sat, Jul 12 2014 2:34 AM

telangana state is not satisfies in central government budget

- కేంద్రం తీరు సరికాదు
- సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ మండిపాటు

చిగురుమామిడి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేటాయింపులు జరిపిందని.. రెండు కొత్తరాష్ట్రంపై ఇంత వివక్ష ప్రదర్శించడం దారుణమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. దీనిపై పార్టీ ఆందోళనలు చేపడుతుందని చెప్పారు. బడ్జెట్ పూర్తిగా కా ర్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చేదిగా ఉందని, నిత్యావసర సరుకులపై పన్ను పెంచేలా ఉందని మండిపడ్డారు. మండలంలోని రేకొండలో శుక్రవారం దివంగత సీపీఐ నాయకుడు, మాజీ ఎంపీపీ చాడ ప్రభాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ లోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని విమర్శించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేం దుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.  
 
కేసీఆర్ హామీలు నెరవేర్చాలి
మండలంలోని రేకొండలో చాడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కోరారు. పంట రుణాల మాఫీ పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ఎప్పుడు పెంచుతారో చెప్పడం లేదని విమర్శించారు.  ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమి ఇస్తామని.. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ముందు అర్హుల జాబితా రూపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి హోదాలో తొలిసారి గ్రామానికి వచ్చిన చాడను రేకొండవాసులు సన్మానించారు. పార్టీ జిల్లా, మండల కార్యదర్శులు నారాయణ, అందె స్వామి, ఎంపీపీ తాడూరి కిష్టయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement