మే 14న ఎంసెట్ | Sakshi
Sakshi News home page

మే 14న ఎంసెట్

Published Tue, Jan 20 2015 12:50 AM

విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి - Sakshi

* ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన విద్యా మండలి
* మే 19న లాసెట్, 21న ఈసెట్, 22న ఐసెట్
* ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్ తేదీలనూ ప్రకటించిన చైర్మన్ పాపిరెడ్డి
* జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు బాధ్యతలు
* 15 శాతం ఓపెన్ కోటాలో ఏ రాష్ట్ర విద్యార్థులైనా పోటీ పడొచ్చు
* దీనికోసం ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ సెట్స్ రాయాల్సిందే
* ఉమ్మడి పరీక్షలను నిర్వహించే అధికారం మాకే ఉంది
* ఉమ్మడి నిధులను ఏపీ మండలే వాడుకుంటోందని ధ్వజం


సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలను రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. మే 14న ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. అలాగే వివిధ యూనివర్సిటీల నేతృత్వంలో లాసెట్/పీజీలాసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, పీజీఈసెట్‌లను నిర్వహించనున్నట్లు సోమవారం ఆయన మండలి కార్యాలయంలో మీడియాకు వివరించారు.
 
 హైదరాబాద్ జేఎన్‌టీయూతోపాటు ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలకు సెట్స్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మండలి నిర్ణయం మేరకు మే 25 తేదీ నుంచి మూడు నాలుగు వారాల పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ కొనసాగుతుంది. జూన్ 4 నుంచి నాలుగైదు రోజులపాటు పీజీఈసెట్ ఉంటుం ది. ఏపీ కూడా సెట్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరు తేదీల్లోనే తెలంగాణ సెట్స్ ఉండేలా తేదీలను ఖరారు చేశారు.
 
ఆర్టికల్ 371(డి) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటా సీట్లకు రాష్ర్ట విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చని, అయితే ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ సెట్స్‌ను రాయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
 
 ఏపీ నుంచి స్పందన రానందునే...
 ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున,  విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలని పాపిరెడ్డి అన్నారు. కానీ నిబంధనలను తుంగలో తొక్కి విభజన చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థ వ్యవహరించిందని పేర్కొన్నారు. ఏపీ సర్కారు ఆదేశాలను అనుసరిస్తూ.. తెలంగాణకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి రాజద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు. అందుకే విభజన చట్టంలోని నిబంధనల మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలిని రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ఆధ్వర్యంలోనే సెట్స్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
 
 ఇందులోభాగంగా రెండు రాష్ట్రాలకు తామే ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈనెల 8న లేఖ రాశామని గుర్తు చేశారు.  చట్ట ప్రకారం ఏపీకి కూడా సేవలు అందిస్తామని, ఓపెన్ కోటా ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలో చేర్చుతామని, ఇందుకు పేరును ప్రతిపాదించాలని కూడా కోరినట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ ఏపీ నుంచి స్పందన రాలేదన్నారు. అందుకే తెలంగాణ విద్యార్థుల కోసం సొంతంగా సెట్స్ నిర్వహించేందుకు తేదీలను ప్రకటించినట్లు ఆయన చెప్పారు. ‘‘ఏపీ కలిసి రానందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనల ప్రకారం ముందుకు సాగుతామని గతంలో గవర్నర్‌ను కలిసినప్పుడే చెప్పాం. ఆ మేరకు చర్యలు చేపట్టాం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం కూడా పేర్కొంది’’ అని పాపిరెడ్డి తెలిపారు.
 
 నిధుల పంపిణీ విషయంలోనూ ఏపీ కౌన్సిల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి నిధులను వాటా ప్రకారం తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ కౌన్సిలే వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాల్సి ఉన్నా.. మండలి విభజన జరగలేదన్న సాంకేతికాంశాన్ని సాకుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ మండలికి ఆ అధికారం లేనందున, ఆ ఖాతాలను నిలిపేయాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశానికి ముందు జరిగిన మండలి సమావేశంలో చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్లు మల్లేష్, వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 ఇప్పటికే ఏపీ సెట్స్ ఖరారు
ఏపీ నిర్వహించబోయే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించింది. ఈ షెడ్యూల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని పేర్కొంది. కానీ తెలంగాణ విద్యా మండలి మాత్రం తెలంగాణకు ప్రత్యేకంగా తేదీలను ప్రకటించింది. దీంతో ఓ రాష్ర్టంలోని విద్యార్థులు మరో రాష్ర్టంలోని విద్యా సంస్థల్లో ఓపెన్ కోటాలో సీటు పొందాలంటే ఆ రాష్ర్ట సెట్స్ ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
 
ఏపీ సెట్స్ షెడ్యూల్

కేటగిరీ    నిర్వహణ తేదీ
ఎంసెట్                   10-05-2015
 ఐసెట్          16-05-2015
ఈసెట్                  14-05-2015
ఎడ్‌సెట్                 28-05-2015
లాసెట్/పీజీలాసెట్    30-05-2015
 పీఈసెట్              14-05-2015 నుంచి
 పీజఈసెట్             25-05-2015 నుంచి

 

Advertisement

తప్పక చదవండి

Advertisement