రేపటి నుంచే ధాన్యం కొనుగోలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే ధాన్యం కొనుగోలు

Published Sun, Oct 19 2014 4:36 AM

రేపటి నుంచే ధాన్యం కొనుగోలు - Sakshi

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలకు పూనుకుంది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
జిల్లాలో 286 కేంద్రాల ఏర్పాటు
* రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు
* పర్యవేక్షణ కోసం అధికారుల నియామకం
* గోదాములను సిద్ధం చేసిన పౌరసరఫరాల శాఖ
* రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెట్టవద్దు
* ‘జీరో’ దందాకు పాల్పడితే లెసైన్సులు రద్దు
* మార్గదర్శకాలు జారీ చేసిన కలెక్టర్ రొనాల్డ్ రోస్
* మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం నుంచి ఖరీఫ్ ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యా న్ని కొనుగోలు చేయాలని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. నిబంధనలను విస్మరించి ‘జీరో’ దందాకు పాల్పడే వ్యాపారులు, వారికి సహకరించే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, కొనుగోలు కేంద్రాలలో నే ధాన్యం అమ్మేలా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకోసం చర్యలు తీసకున్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఈనెల 20న అన్ని ప్రాం తాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మరోమారు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
కోనుగోలు కేంద్రాలలో వసతులు
ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం బాన్సువాడలో కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించగా, తక్కిన 285 కేంద్రాలను సోమవారం ప్రారంభించనున్నారు. గతంలో రైతులు ధాన్యం తీసుకుని వచ్చి రెండు మూడు రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈసారి అలా జరుగకుండా సకాలంలో కొనుగోలు, డబ్బుల చెల్లింపు సాగేలా ‘ఆన్‌లైన్’ విధానాన్ని ప్రవేశపెట్ట బోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు రూ.54 లక్షలు కేటాయించింది.

వీటిని టార్పాలిన్లు, తేమ యంత్రాల కొనుగోలు, కొనుగోలు కేంద్రాలలో కనీస వసతుల కల్పన కోసం ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది రెండో పంటకు ఆస్కారం లేనందున, రైతుల అవసరాలకు 30శాతం పోను ప్రజాపంపిణీ వ్యవస్థకు సరిపోయే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదివరకే మిల్లర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు.
 
ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు శిక్షణ
ఈ సీజన్‌లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహశీల్‌దార్లను నియమిం చారు. సంబంధిత ఏరియాలకు చెందిన రెవెన్యూ అధికారులను పరిశీలకులుగా నియమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూరు,   బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు,మిల్లులలో ఏర్పాట్లు చేశారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు కొనుగోలుపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తేమ లేకుండా ధాన్యాన్ని కొనుగోలుకు తర లించేలా కరప్రతాలు ముద్రించి పంపిణీ చేశారు. నిబంధనలు, దళారులతో రైతులకు ప్రతిబంధకాలు కాకుండా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.  
 
వరికి మద్దతు ధర పెంపు
మోర్తాడ్ : ఖరీఫ్ సీజనులో సాగు చేసిన వరి ధా న్యానికి తెలంగాణ సర్కారు మద్దతు ధరను కొద్ది గా పెంచింది. ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి గతంలో క్విం టాలుకు రూ.1,345 ఉండగా ఇప్పుడు రూ. 55 పెంచి రూ.1,400 ధర నిర్ణయించారు. ‘బి’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,310 ఉండగా రూ. 50 పెంచి రూ.1,360 ధర నిర్ణయించారు. వరి సాగుకు ఖ ర్చులు భారీగానే పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరను పెంచకపోవడంతో ఆశించినంతగా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నా రు. మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ పెట్టడానికి దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. సన్న రకాలను కొనుగోలు చేసే అవకాశం తక్కువ. ఒకవేళ కొనుగోలు కొనుగోలు చేసినా ‘బి’ గ్రేడ్ ధరనే చెల్లిస్తారు. ప్రభుత్వం సన్న రకాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుని, మద్దతు ధరను ఎక్కువగా నిర్ణయిస్తే బాగుండేదని రైతులు భావిస్తున్నారు.
 
గతంలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. దీంతో సన్న రకం ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు విక్రయించారు. మార్కెట్‌లో సన్న బియ్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధాన్యం కొనుగోలు సమయంలో తక్కువ ధరను చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని పలువురు కోరు తున్నారు.

Advertisement
Advertisement