Sakshi News home page

బస్సు నుంచి విద్యార్థిని నెట్టేసిన కండక్టర్

Published Wed, Aug 13 2014 2:53 AM

బస్సు నుంచి విద్యార్థిని నెట్టేసిన కండక్టర్ - Sakshi

విరిగిన బాలుడి కుడి చేరుు
మరో ప్రయాణికురాలితోనూ దురుసుగా ప్రవర్తన
కల్లెడలో ఘటన ఆందోళనకు దిగిన గ్రామస్తులు

 
పర్వతగిరి : బస్సు నుంచి కండక్టర్ నెట్టేయడంతో ఓ విద్యార్థి చేరుు విరిగిన సంఘటన మండలంలోని కల్లెడలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. మండలంలోని కల్లెడకు చెందిన బొంత ప్రవీణ్ పర్వతగిరిలోని మోడల్ స్కూల్‌లో ఆరోతరగతి చదువుతున్నాడు. రోజులాగే సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లేందుకు నర్సంపేట నుంచి తొర్రూరుకు వెళ్లే బస్సును తోటి విద్యార్థులతో కలిసి పర్వతగిరిలో ఎక్కాడు. కల్లెడలో బస్సు దిగుతుండగా త్వరగా దిగండంటూ కండక్టర్ విద్యార్థులను కిందికి నెట్టేసింది. దీంతో ప్రవీణ్ కిందపడడంతో కుడి చేయి విరిగింది. దీంతో అతడు రోదిస్తూ ఇంటికి వెళ్లాడు.

ఇదిలా ఉండగా పర్వతగిరికి చెందిన బోనగిరి రమ ఇదే బస్సులో చెన్నారావుపేటలో ఎక్కింది. పర్వతగిరికి టికెట్ తీసుకుంది. ఆమె పర్వతగిరి బస్టాండ్ దాటాక గ్రామ చివరన ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బస్సు ఆపి దిగబోయింది. ఈ క్రమంలోనే కండక్టర్ ఆమె టికెట్‌ను పరిశీలించి కల్లెడకు తీసుకోవాల్సిన టికెట్‌ను పర్వతగిరికి తీసుకున్నావని దురుసుగా ప్రవర్తించి నెట్టేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి భర్తకు జరిగిన విషయం చెప్పి కంటతడి పెట్టింది.

తిరుగు ప్రయాణంలో బస్సు ఆపి ఆందోళన..

తొర్రూరుకు వెళ్లిన బస్సు నర్సంపేటకు ఇదే రూట్‌లో తిరిగి వస్తుండగా కల్లెడ వద్ద బాధితుల బంధువులు ఆపేశారు. ప్రవీణ్ తల్లిదండ్రులు, రమ భర్త దుర్గేష్, విద్యార్థుల తల్లిదండులు, గ్రామస్తులు లేడీ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు బస్సు ఎక్కితే సహించడం లేదని, చిన్నపిల్లలని చూడకుండా నెట్టేయడం సమంజసం కాదన్నారు. బస్సుపాస్‌తో ప్రయాణించే విద్యార్థులను చూస్తే డ్రైవర్లు బస్సు ఎందుకు ఆపరని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాగా ప్రవీణ్ వైద్య ఖర్చులను భరించేందుకు నర్సంపేట డిపోకు వెళ్లి మాట్లాడాలని పెద్దమనుషులు నచ్చజెప్పటంతో సుమారు రెండు గంటల తర్వాత బస్సును నర్సంపేటకు పంపారు.
 
 

Advertisement
Advertisement