ఉద్యమం తరహాలో ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

ఉద్యమం తరహాలో ఉత్సవాలు

Published Fri, May 29 2015 6:14 AM

The movement of the festivities in style

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవ వేడుకలను గొప్పగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నీ మర్చిపోయి ప్రజలంతా ఒక్కటై ఏ విధంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నిర్వహించారో... జూన్ నుంచి 2నుంచి జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లోనూ అదే విధంగా పాల్గొనాలి’ అని రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ జారుుంట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్‌ఓ వీరబ్రహ్మయ్యలతో కలిసి ఈటల తెలంగాణ  ఆవిర్భావ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు.

జూన్ 2న ఉదయం 8.15 గంటలకు గ్రామ, మండల, మున్సిపాలిటీ, నగర పంచాయ తీ, కార్పొరేషన్లలో తెలంగాణ తల్లి విగ్రహా లకు, అమరవీరుల స్థూపాలకు సెల్యూట్ చేయడంతో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లాలోని అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం. తెలంగాణ సాధన కోసం పాటుపడిన ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పిస్తాం. సాయంత్రం జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం.

జూన్ 3 నుంచి 7 వరకు ప్రతిరోజూ అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, క్రీడలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ప్రతిరోజు సాయంత్రం తెలంగాణ కళారూపాలు, బాగోతాలు, తెలంగాణ వంటకాల కార్యక్రమాలుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరిస్తాం.

మండల స్థాయిలో 10, నగర పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో 15, కార్పొరేషన్ స్థాయిలో 20, జిల్లాస్థాయిలో 30 మంది చొ ప్పున వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిం చిన వారిని ఎంపిక చేసి నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తాం. ఇందుకోసం మం డల, నగర, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.10,116, జిల్లాస్థాయిలో ఎంపికైన వారికి రూ. 50,116ల చొప్పున నగదు అందజేస్తాం.

తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల నిర్వహణ కోసం జిల్లాకు రూ.1.2 కోట్లు కేటాయించినప్పటికీ... అందులో రూ.90 లక్షలు అవార్డులకుపోగా, మిగిలిన రూ.30 లక్షలు ప్రచారానికి ఖర్చవుతుంది. మిగిలిన కార్యక్రమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, ఇతరులు సాయం అందించాలి.

కరీంనగర్ సర్కస్ మైదానంలో జూన్ 3న ముషాయిరా, 5న ఖవ్వాళీ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఆరు రోజులపాటు తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లాలకంటే కరీంనగర్‌లో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు.
 
 ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి
 రాష్ట్ర అవతరణ వేడుకలలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజ యవంతం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అంతకుముందు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ పాటల సీడీలోని పాటలు ప్రజలకు వినిపించాలన్నారు. ముఖ్యమంత్రి సందే శం ప్రతులు గ్రామాలలో పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మం డల, డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ప్రతి రోజు సాంస్కతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమ వివరాలు ప్రతి రోజు జిల్లా కేంద్రానికి పంపాలని సూచించారు.

Advertisement
 
Advertisement