Sakshi News home page

'రెండు రోజుల్లో దొంగలను పట్టుకుంటాం'

Published Fri, Jan 23 2015 6:23 PM

'to catch the decoits in two days'

వనపర్తిరూరల్ (మహబూబ్‌నగర్): మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం మరికుంట సమీపంలో దారి దోపిడీకి పాల్పడ్డ దొంగలను రెండురోజుల్లో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. వివరాలు.. వనపర్తి మండలం రిజర్వు ఫారెస్టు కర్నూల్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని దుండగులు అర్దరాత్రి అడ్డగించి దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి పెద్ద పెద్ద కర్ర మొద్దులను రోడ్డుకు అడ్డంగా ఉంచి దోపీడీ చేశారు. నాలుగు వాహనాలను ఆపి ట్రాక్టర్‌లపై వస్తున్న వారి నుంచి రూ. 3 వేలు దోచుకున్నట్లు తెలిసింది. బాధితులు సంఘటన స్థలం నుంచే 100కు ఫోన్ చేయగా వనపర్తి రూరల్ పోలీసులు అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దొంగలు వాహనదారులను బెదిరించి డబ్బులు తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి శుక్రవారం ఉదయం దోపిడీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వరుసగా జరుగుతున్న దోపిడీలను వెంటనే అరికట్టాలని పోలీసులను కోరారు. రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ జోగుల చెన్నయ్య ఎమ్మెల్యే చిన్నారెడ్డికి హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాగే 2014 నవంబర్ 24న ఇదే ప్రాంతం వద్ద వాహనాలను ఆపి రూ.9500లు దోచుకెళ్లినట్టు సమాచారం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement