ఏం చేద్దాం! | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం!

Published Fri, Feb 6 2015 2:32 AM

ఏం చేద్దాం! - Sakshi

* పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఆత్మావలోకనం
* నేడు గాంధీభవన్‌లో బృంద సమీక్షలు
* సీనియర్ల అభిప్రాయాలతో భవిష్యత్తు కార్యాచరణ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటమి భారంతో కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుంబిగించింది. సార్వత్రిక ఎన్నికల గుణపాఠంతో తేరుకున్న నాయకత్వం.. భవిష్యత్తు వ్యూహంపై మేధోమథనం సాగిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రజల అభిమానాన్ని చూరగొనే దిశగా ఆలోచన చేస్తోంది.

ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పార్టీ బలోపేతంపై సీనియర్లతో బృంద సమీక్షలు జరుపుతోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యనేతలు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పరాజయానికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తునే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో చర్చించనున్నారు. 39 మంది సీనియర్లు, ముఖ్యనాయకులు ఈ గ్రూపుల చర్చల్లో పాలుపంచుకోనున్నారు. మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఈ బృందాలకు నేతృత్వం వహించనున్నారు.

అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడంలో పార్టీ హైకమాండ్ విఫలమైందనే అభిప్రాయాలు వినిపిస్తుండడం, ఎన్నికల అనంతరం కొందరు పార్టీని వీడినా పట్టించుకోలేదనే విమర్శల నేపథ్యంలో అధిష్టానం ఈ సమీక్ష లు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు జరిగే ఈ భేటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement