నేడే బడ్జెట్‌ | Sakshi
Sakshi News home page

నేడే బడ్జెట్‌

Published Sat, Feb 9 2019 11:04 AM

Today GHMC Budget Meeting - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం (2019–20) బడ్జెట్‌పై శనివారం జీహెచ్‌ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు రూ.11,538 కోట్లతో బడ్జెట్‌కు ఇప్పటికే స్టాండింగ్‌ కమిటీ అమోద ముద్ర వేసింది. పాలక మండలిలోఅధికార టీఆర్‌ఎస్‌తో  పాటు మిత్రపక్ష ఎంఐఎం సభ్యులే ఉండడంతో ఎలాంటి చర్చ, మార్పు చేర్పులు లేకుండానే  ఆమోద ముద్ర పడనుంది. జీహెచ్‌ఎంసీ కొత్త పాలక మండలి కొలువుదీరినప్పటినుంచీ ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో బలమైన ప్రతిపక్షం ఉండడంతో సర్వసభ్య సమావేశంలో పట్టుబట్టి మరీ బడ్జెట్‌లో మార్పుచేర్పులు చేయించేవారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ప్రతిపక్షాలంటూ లేనందున బహుశా యథాతధంగా ఆమోదించే అవకాశముంది. 

రెండు భాగాలుగా బడ్జెట్‌
జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను రెండు భాగాలుగా విభజించారు. బడ్జెట్‌ రూ.6,150 కోట్లే అయినప్పటికీ ఇతర కార్పొరేషన్ల నుంచి భారీ ప్రాజెక్టులకు అందుతాయని భావిస్తున్న రూ.5,388 కోట్లు కూడా కలిపి మొత్తం రూ.11,538 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఏటికేడు బడ్జెట్‌ పెరగాలే తప్ప తగ్గరాదనే సాధారణ నియమాన్ని ప్రాతిపదికగా తీసుకొని జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను మాత్రం గత సంవత్సరం ఉన్న రూ.6,076.86 కోట్ల కంటే స్వల్పంగా పెంచి రూ.6,150 కోట్లుగా చూపారు. వాస్తవ పరిస్థితులను కొంతమేర పరిగణనలోకి తీసుకొని ఇతర కార్పొరేషన్ల నుంచి ప్రాజెక్టులకు అందే నిధులను గతేడాది ఉన్న రూ.7,073.14 కోట్ల నుంచి రూ.5,388 కోట్లకు తగ్గించారు. అయినప్పటికీ వస్తాయనుకున్న నిధులకు, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఏటా ఆమోదిస్తున్న బడ్జెట్‌లో దాదాపు సగం బడ్జెట్‌ను మాత్రమే అమలవుతోంది. 

మార్చి 7లోపు ప్రభుత్వానికి  
పాలకమండలి సర్వసభ్య సమావేశంలో 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ఆమోద మద్ర పడిన తర్వాత ప్రభుత్వానికి సమాచార నిమిత్తం పంపించడమూ లాంఛనప్రాయమే. నిర్ణీత షెడ్యూల్‌ మేరకు ప్రభుత్వ అమోదం కోసం మార్చి 7వ తేదీలోగా పంపించాల్సి ఉంది. ఆలోపు పంపే విధంగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. 

Advertisement
Advertisement