టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అవకాశం | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అవకాశం

Published Sun, May 31 2015 4:39 AM

TRS has got chance to join TDP mla Madhavaram krishna  rao

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే సంఖ్య కలసి వచ్చింది. కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ త లుపు తట్టడంతో టీఆర్‌ఎస్ చేతిలో 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లయింది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వలస వచ్చిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఫలితంగా టీడీపీ బలం పది ఎమ్మెల్యేలకు తగ్గిపోయింది.
 
 మరికొందరు కూడా..: గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టిన టీఆర్‌ఎస్ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు... మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం మాధవరం బాటలోనే ఉన్నారని తెలిసింది. గత నెలలోనే ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఆయన అధికారికంగా చేరాలి. ఇక నగరానికే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం గులాబీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. రేపో మాపో ఆయనా చేరడం ఖాయమంటున్నారు.
 
 టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేయించే వ్యూహంలో భాగంగా.. ఆత్మప్రబోధంతో ఓటేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే చేరిపోవడం, మరో ఇద్దరు చేరికకు సిద్ధంగా ఉండటం తమకు ఓటింగ్‌లో కలిసొచ్చే అంశమని టీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక చేరికలతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లేసేలా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో మంతనాలు చేసినట్లు పేర్కొంటున్నాయి.  
 

Advertisement
Advertisement