రెండో లిస్ట్‌లో ముగ్గురు | Sakshi
Sakshi News home page

రెండో లిస్ట్‌లో ముగ్గురు

Published Sun, Apr 6 2014 3:24 AM

trs to announce candidates for elections

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్‌ఎస్ తాజాగా మరొకరి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇంకా  ఖరారు చేయాల్సి ఉంది.
 
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మంద జగన్నాథం టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అంజయ్య యాదవ్‌కే మరోసారి అవకాశం దక్కింది. నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, ఇటీవల పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.
 
అభ్యర్థిత్వంపై స్పష్టత రాక మునుపే విఠల్‌రావు ఆర్య శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు టిక్కెట్‌పై హామీతో పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిఆర్‌ఎస్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టిఆర్‌ఎస్ ముఖ్య నేత హరీష్‌రావును శివకుమార్‌రెడ్డి శనివారం కలిశారు. ఆయన పేరును ఆది, లేదా సోమవారం ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. కాగా కొడంగల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చిన తర్వాతే టిఆర్‌ఎస్ అభ్యర్థి పేరును వెల్లడించాలని పార్టీ భావిస్తోంది.
 
త్వరలో కేసిఆర్ సభ
జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడతో నేతలందరూ నామినేషన్ల దాఖలుపై దష్టి సారించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ ప్రచార పర్వంలోనూ ఇదే వైఖరి అవలంభించాలని భావిస్తోంది.
 
పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌తో కనీసం రెండు చోట్ల బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు హరీష్‌రావు, కేటిఆర్, కేశవరావు వంటి నేతలతో రోడ్‌షోలు నిర్వహించేలా అభ్యర్థులు ప్రచార ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement