రెండో విడత కౌన్సెలింగ్‌పై తొలగని అనిశ్చితి | Sakshi
Sakshi News home page

రెండో విడత కౌన్సెలింగ్‌పై తొలగని అనిశ్చితి

Published Mon, Aug 13 2018 2:23 AM

Uncertainty on Medical Counseling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపై రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతోంది. మొన్నటివరకు అఖిల భారత కోటా సీట్ల రెండో విడత కౌన్సెలింగ్‌ ఫలితాలు వెల్లడి కాకపోవడంతో రాష్ట్రంలో సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నిలిపివేశారు. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ జీవో నంబర్‌ 550పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం సందిగ్ధంలో పడిపోయింది.

మొదటి విడత కౌన్సెలింగ్‌ సమయంలోనూ ఈ జీవోపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్లాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయిం చలేదని, సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశాక ఏం చేయా లన్న దానిపై ఒక అంచనాకు వస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా?  
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో కాలేజీలో రిజర్వేష న్‌ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరి స్థితి నెలకొంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్‌ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్‌ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్‌ 550 తీసుకొచ్చింది. ఎక్కువ మార్కులు వచ్చి ఓపెన్‌ కేటగిరీలో సీటు దక్కించుకునే అభ్యర్థులను రిజర్వేషన్‌ కింద లెక్కించకూడదని, ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘా లు డిమాండ్‌ చేస్తున్నాయి.

444 సీట్లకు జరగాల్సిన కౌన్సెలింగ్‌
అఖిల భారత కోటా సీట్లలో చేరాక మిగిలిన వాటిని తిరిగి రాష్ట్రానికి కేటాయించిన 63 సీట్ల తో కలుపుకొని మొత్తం 444 ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు మిగిలాయి. ఈ నెల 12కి రెండో విడత కౌన్సెలింగ్‌ అయిపోవాల్సి ఉంది. కానీ పై కార ణాలతో కౌన్సెలింగ్‌ వాయిదా పడుతోంది.    

Advertisement
Advertisement