వరంగల్ ఖిలా పునరుద్ధరణకు నిధులు | Sakshi
Sakshi News home page

వరంగల్ ఖిలా పునరుద్ధరణకు నిధులు

Published Fri, Oct 7 2016 2:38 AM

Warangal  Qila Restoration of funds

హృదయ్ పథకం కింద పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: హృదయ్ పథకం కింద వరంగల్, వారణాసి, అమృత్‌సర్, ద్వారక, పూరీ నగరాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.114 కోట్లు మంజూరు చేసింది. ఆయా ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ఆ శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఐదు నగరాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాజీవ్‌గాబా నేతృత్వంలోని కమిటీ ఆమోదించింది.

వారణాసికి రూ.13.25 కోట్లు, అమృత్‌సర్‌కు రూ.57 కోట్లు, పూరీకి రూ.17 కోట్లు, ద్వారకకు రూ.10 కోట్లు, వరంగల్‌కు రూ.15.30 కోట్లు మంజూరు చేశారు. వరంగల్‌కు కేటాయించిన నిధులతో ఖిలాకు వెళ్లే మార్గాలు, ప్రవేశ ద్వారాల పునరుద్ధరణ...ఉత్తర ద్వారం వద్ద మౌలిక వసతుల వంటివి ఏర్పాటు చేస్తారు.
 
రూ.350 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
హృదయ్ పథకం కింద దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని వారసత్వ సంపద గల ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఏపీ నుంచి అమరావతి, తెలంగాణ నుంచి వరంగల్ నగరాలున్నాయి. మొత్తం 12 నగరాల్లో ఇప్పటివరకు రూ.350 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. హెరిటేజ్ నగరాలపై ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

Advertisement
Advertisement