నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

Published Sat, Jan 12 2019 12:05 PM

Warangal SP Talk On Crime News - Sakshi

భూపాలపల్లి: నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటూనే ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో ముందుండి జవాబుదారీగా పనిచేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులు అందించిన వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పెండింగ్‌ కేసుల విషయంలో సమర్థవంతంగా పనిచేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, నేరాల దర్యాప్తులో అధునాతన సాంకేంతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకోవాలన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించబడిన జరిమానాను ఇప్పటి నుంచి ఈ–చలాన్‌ సిస్టం ద్వారా మీ సేవా కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాబోయే పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సమావేశంలో భూపాలపల్లి, ఏటూరునాగారం అడిషనల్‌ ఎస్పీలు రాజమహేంద్రనాయక్, శరత్‌చంద్రపవర్, భూపాలపల్లి, ములుగు, కాటారం, డీఎస్పీలు కిరణ్‌కుమార్, విజయసారథి, కేఆర్‌కే ప్రసాద్, ఎస్‌బీ, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటేష్, మోహన్, జిల్లా పరిధిలోని సీఐలు పాల్గొన్నారు.   

పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ భాస్కరన్‌  

Advertisement

తప్పక చదవండి

Advertisement