ఏప్రిల్‌లో వాటర్‌గ్రిడ్‌పైలాన్ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో వాటర్‌గ్రిడ్‌పైలాన్ ఆవిష్కరణ

Published Tue, Mar 17 2015 12:13 AM

Water Grid Pylon in Nalgonda to be Completed by Next

 చౌటుప్పల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి చిహ్నంగా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్‌ను ఏప్రిల్ మొదటి వారంలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తె లిపారు. సోమవారం పైలాన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పైలాన్ ఆవరణలో ఒకే రకమైన మొక్కలు కాకుండా, వివిధ రకాల మొక్కలు నాటాలని సూచించారు. పైలాన్‌కు నాలుగు వైపుల నుంచి వేస్తున్న రోడ్లను సుందరం తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పైలాన్ నిర్మాణ పనులు మరో ఐదారు పూర్తికానున్నాయన్నారు. ప్రస్తుతం నిర్మాణాలకు తుదిమెరుగులు దిద్దుతున్నట్టు వివరించారు. పనులు వేగవంతంగా పూర్తిచేసిన ఆర్‌డ బ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్లును అభినందించారు. అలాగే హరితహారం పథకం కింద జిల్లాలో 4.86కోట్ల మొక్కలు నాటేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 470 నర్సరీల్లో 4.30కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు వివరించారు. మరో 30లక్షల యూకలిప్టస్ మొక్కలను కూడా సిద్ధం  చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, దీన్‌దయాల్, తహసీల్దార్ షేక్ అహ్మద్, ముటుకుల్లోజు దయాకరాచారి, తరుణ్, సైదాసాహేబ్ తదితరులున్నారు.
 
 కథలు చెప్పొద్దు.. ఏడీపై ఆగ్రహం
 చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని టెక్స్‌టైల్‌పార్కును సోమవారం ఉదయం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సందర్శించారు. ఇటీవల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.5కోట్లు విడుదల చేసిందని, దీనికి అనుగుణంగా పార్కులో మౌళిక వసతుల క ల్పనకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. యూనిట్లను పరిశీలించారు. యూనిట్లకు అవసరమైన కార్మికులను అందించేందుకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం సక్రమంగా నడవకపోవడంపై చేనేత జౌళిశాఖ ఏడీ సంజీవరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటిసాకులు, కట్టుకథలు చెప్పొద్దు, పనితీరును మార్చుకోండి, నిరంతరంగా శిక్షణ కేంద్రంను నడపాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ షేక్‌అహ్మద్, హరిశ్చంద్రారెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, దబ్బటి కృష్ణ తదితరులున్నారు.
 
 చోరీపై ఎస్పీతో మాట్లాడిన కలెక్టర్
 టెక్స్‌టైల్‌పార్కులోని కుట్టుశిక్షణ కేంద్రంలో ఇటీవల చోరీ జరిగింది. రూ.4లక్షల విలువైన కుట్టుమిషన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ ఏడీ సంజీవరావును ప్రశ్నించారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు ఇంత వరకు దొంగలను పట్టుకోలేదని సమాధానమిచ్చారు. దీంతో కలెక్టర్ నేరుగా ఫోన్‌లో ఎస్పీతో మాట్లాడారు. వారం రోజుల్లో దొంగలను పట్టుకోవాలనిఆదేశించారు.
 
 ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణకు సన్నాహాలు
 వాటర్ గ్రిడ్ పైలాన్‌ను దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీని కూడా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement