ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యుద్ధం: ఆర్.కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యుద్ధం: ఆర్.కృష్ణయ్య

Published Sat, Jan 24 2015 6:41 PM

we will fight for fees reimbersment: r.krishnaiah

వినాయక్‌నగర్ (నిజామాబాద్): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణం విడుదల చేయకపోతే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా గత ఏడాదితోపాటు, ఈ విద్యాసంవత్సరం ఫీజులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో 'బీసీ విద్యార్థి శంఖరావం' పేరుతో సదస్సు శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ.850 కోట్ల ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే రకరకాల అంక్షలు పెట్టి విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి బీసీ విద్యార్థికి మొత్తం ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా జారీ చేసిన జీఓ నం.18, 50కి తూట్లు పొడుస్తున్నారన్నారు.

గతంలో తాను చేసిన నిరాహార దీక్షల ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో దొరల రాజ్యాన్ని తలపిస్తూ, పేద పిల్లలు చదువుకోకుండా చేస్తోందని విమర్శించారు. అవసరం లేని వాటికి కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement