అనుమానం పెనుభూతమై.. | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Published Thu, Dec 18 2014 2:32 AM

wife killed by husband

 సూరేపల్లి(నిడమనూరు) : అనుమానం పెనుభూతమైంది.. ఆదమరచి నిద్రపోతున్న రెండో భార్యను రోకలితో మోది దారుణంగా హత్య చేశాడు.. ఓ భర్త. ఈ దారుణ ఘటన నిడమనూరు మండలం సూరేపల్లిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇరుగంటి శ్రీను వ్యవసాయ బావి మోటార్లను మరమ్మతు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన నాగేంద్రమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో 11 ఏళ్ల క్రితం మొదటి భార్య చెల్లెలు రేణుక(30)ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి శివకుమార్, ప్రియాంక ఇద్దరు సంతానం కలిగారు.
 
 భార్యలతో గొడవపడి..
 శ్రీను మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు భా ర్యలతో గొడవపడ్డాడు. రెండో భార్య రేణుక మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టడడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందోనని చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేయడంతో రేణుక కోసం గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. మొదటి భా ర్య నాంగేంద్రమ్మ ఇంట్లో పడుకోగా, శ్రీను బయటకు వెళ్లాడు.
 
 అర్ధరాత్రి వచ్చి.. ఘాతుకానికి పాల్పడి..
 కొద్దిసేపటి తరువాత రేణుక ఇంటికి వచ్చి మంచంలో పడుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు శ్రీను తప్పతాగి ఇంటికి వచ్చాడు. తలుపులు బాదడంతో కొద్ది సేపటి వరకు ఎవరూ తీయలేదు. ఆగ్రహానికి లోనైన శ్రీను పక్కనే ఉన్న రోకలితో తలుపు కొట్టడంతో నాంగేంద్రమ్మ వచ్చి తెరిచింది. బూతులు లంకించుకుని తలుపు గట్టిగా తోయడంతో నాగేంద్రమ్మ కిందపడిపోయింది. శ్రీను ఇంట్లోకి వెళ్లి మంచంపై పడుకున్న రేణుక తలపై విచక్షణా రహితంగా మోదడంతో నిద్రలోనే ప్రాణాలు విడిచింది. భయాందోళన చెందిన నాగేంద్రమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో శ్రీను అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రేణుకను పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.
 
 ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ
 హత్యోదంతం సమాచారం తెలుసుకుని బుధవారం ఉదయం  మిర్యాలగూడ టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  సీఐ ఆధ్వర్యంలో కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు.
 

Advertisement
Advertisement