అంధుడైన భర్తను హతమార్చిన భార్య..? | Sakshi
Sakshi News home page

అంధుడైన భర్తను హతమార్చిన భార్య..?

Published Wed, Jun 18 2014 1:31 AM

అంధుడైన భర్తను హతమార్చిన భార్య..? - Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని...
 
అశ్వారావుపేట: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అంధుడైన భర్తను హతమార్చిందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి నిర్బంధించిన సంఘటన అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక బంజారా కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆసుపాకకు చెందిన అంధుడు జర్బలా నాగేశ్వరరావు(34)కు దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన అరుణతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అరుణకు ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ నాగేశ్వరరావు పలుమార్లు గొడవకు దిగాడు. ఈ విషయంలో గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి తప్పు చేయవద్దంటూ అరుణను హెచ్చరించారు. ఈ క్రమంలో తన భార్య వైఖరి స రిగా లేదంటూ నాగేశ్వరరావు గత ఏడాది అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా డు. అయినా వైఖరి మార్చుకోకుండా తననే చంపేస్తానని బెదిరిస్తోందని నెల రోజుల క్రితం నాగేశ్వరరావు అశ్వారావుపేటలో పెద్ద మనుషుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో తన ఆస్తిని భార్య, పిల్లలకు పంచే విధంగా మూడు రోజుల క్రితం ఒప్పందం చేసుకున్నారు. కానీ సోమవారం రాత్రి అతను ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.

 కుక్కలు మొరగడంతో....
 సోమవారం రాత్రి 11.30 నిమిషాల సమయంలో నాగేశ్వరరావు ఇంటి వద్ద కుక్కలు మొరుగుతుండడంతో ఇరుగుపొరుగు వారు మేల్కొని వచ్చారు. అప్పటికే నాగే శ్వరరావు ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరి తాడుతో వేలాడుతూ కనిపించాడు. అరుణ, మరో వ్యక్తి కలిసి నాగేశ్వరరావును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపిస్తూ గ్రామస్తులు అరుణపై దాడి చేసి నిర్బంధించారు. అశ్వారావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపాక చేరుకున్న పోలీసులు వెంటనే నాగేశ్వరరావు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిందితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 నాగేశ్వరరావు మృతిపై అనుమానాలు...
 నాగేశ్వరరావు మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్టు గుడ్డి వాడైన నాగేశ్వరరావుకు చెట్టు ఎక్కడం రాదని, చీకట్లో అతను చెట్టు ఎక్కి ఎలా ఉరి వేసుకున్నాడని అంటున్నారు. నాగేశ్వరరావు మృతితో ఆసుపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు అశ్వారావుపేట కమ్యూనిటీ ఆస్పత్రికి చేరుకున్నారు. అరుణకు అదే గ్రామానికి చెందిన చిలకారావుతో వివాహేతర సంబంధం ఉందని, కోడలు అరుణ, చిలకారావులపై అనుమానాలు ఉన్నాయని నాగేశ్వరరావు తల్లి పిచ్చమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు అశ్వారావుపేట పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement