జల్సాలకు అడ్డొస్తున్నాడని.. | Sakshi
Sakshi News home page

జల్సాలకు అడ్డొస్తున్నాడని..

Published Wed, Jul 22 2015 1:05 AM

Wife planed murder attempt on her husbend

♦ భర్తపై భార్య  హత్యాయత్నం
♦ కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నం
♦ తీవ్ర గాయాలు..ఆస్పత్రికి తరలింపు

 దోమ : తన సరదాలకు అడ్డు తగులుతున్నాడనే కోపంతో భర్తను చితకబాది ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించింది  ఓ భార్య. ఈ సంఘటన దోమ మండలంలోని రాకొండలో సోమవారం అర్ధరాత్రి  జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాకొండకు చెందిన బోయిని వెంకటయ్య, భారతమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి పదేళ్లలోపు వయసున్న కుమారుడు, కూతురు ఉన్నారు.  కొంతకాలంగా భార్య మద్యానికి బానిసైంది. భర్తతోపాటు పిల్లల బాగోగులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తరచూ చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకోవడం, దాడికి పాల్పడుతోంది.

పద్ధతి మార్చుకోవాలని భర్త ఎన్నిసార్లు సూచించినా ఆమె పట్టించుకోలేదు. పై పెచ్చు అతడిపైనే దాడికి దిగేది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  భర్త వేరే గ్రామానికి వెళ్లి  సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుటుంబ విషయమై అతడితో వాగ్వావాదానికి దిగి కర్రతో చితకబాదింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అదే రాత్రి నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్‌పోసి నిప్పంటించి పారిపోయింది. మంటలకు తాళలేక బయటకు పరిగెత్తుకు వెళ్లి గ్రామస్తులకు తెలపడంతో వారు అత డిని వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు అంజిలయ్య మంగళవారం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ భీంకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement