జియాగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 రోజులకే ఫోన్లో మూడుసార్లు తలాక్ చెప్పిన ఓ భర్త ఉదంతమిది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని ముస్తయిద్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్జల్, సబియా బేగం దంపతులు, కూతురు హాతియా బేగం(27)లు 2006 నుంచి గోల్కొండలోని బడాబజార్లో అద్దెకు గదిలో నివసిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ సర్దార్ మజర్, హాతియాబేగం ప్రేమించుకున్నారు. 2013లో హాతియా బేగం గల్ఫ్ వెళ్లి ఖతార్లో బ్యూటీషియన్ జాబ్ చేయసాగింది.
కాగా, నగరంలోనే ఉన్న మజర్తో ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. మజర్ తరచూ తన అవసరాల నిమిత్తం హాతియా బేగం నుంచి డబ్బులు తెప్పించుకోసాగాడు. సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బులు తెప్పించుకున్నాడు. స్వదేశానికి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో హాతియా బేగం ఇటీవల హైదరాబాద్ వచ్చింది. అక్టోబర్ 18న కుటుంబ సభ్యులతో కలిసి పురానాపూల్లోని మియామస్క్ బాగ్ దర్గాలో వివాహం చేసుకున్నారు. 4 తులాల బంగారం, హోండా ఆక్టివా వాహనం, ఫర్నీచర్ తదితరవి కట్న కానుకలుగా మజర్కు అందజేశారు. మజర్ ఈ నెల 13న నూరా అలియాస్ ఫర్హాత్ అనే యువతి తనపై వ్యామోహం పెంచుకుందని, తను దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భార్య హాతియాబేగంతో చెప్పి వెళ్లిపోయాడు. వెళ్లిన రెండు మూడు రోజులకు నేను నూరా ఫర్హాత్తో ఉంటున్నాను అని హాతియా బేగంతో ఫోన్లో తలాక్... తలాక్... తలాక్... అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయినప్పటికీ హాతియా బంధువులు, తల్లిదండ్రులు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయడానికి ఫోన్ చేయగా మజర్ వారిని బెదిరించాడు. దీంతో హాతియాబేగం కుల్సుంపురా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.