సంగారెడ్డి : కొత్త చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలపై దాడులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపుర వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాను మెదక్ జిల్లాలో పర్యటించాననీ, మహిళల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సంగారెడ్డిలోని ఐబీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముఖ్యంగా నెలల పసికందు మొదలు కొని 75 ఏళ్ల వృద్ధురాలి వరకు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. పోలీస్స్టేషన్లలో సైతం మహిళలకు సరైన న్యాయం దొరకడం లేదన్నారు. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన మహిళలకు నెలల తరబడి తిరిగినా కనీసం ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఇవ్వడం లేదన్నారు. మహిళల్లో చైతన్యంతోనే జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవచ్చునన్నారు.