రీ షెడ్యూల్‌పై అన్నదాతల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

రీ షెడ్యూల్‌పై అన్నదాతల ఆగ్రహం

Published Thu, Nov 6 2014 1:16 AM

Wrath of farmers on re-scheduled

గజ్వేల్:  రుణాల రీ-షెడ్యూల్‌కు బ్యాంక్ మేనేజర్ సహకరించడం లేదంటూ పలువురు రైతులు ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్‌ను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అక్కారం, కోనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లోపు రుణాలను రెన్యూవల్ చేసి ప్రస్తుతం రీ-షెడ్యూల్‌కు అర్హత సాధించారు.

అయినా ప్రజ్ఞాపూర్ బ్యాంక్ మేనేజర్ రీ-షెడ్యూల్ చేయకుండా రెన్యూవల్ మాత్రం చేసి అతితక్కువ రుణం మాత్రమే ఇస్తానని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. రీ-షెడ్యూల్ ఎందుకు చేయవంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏఈఓ కృష్ణవేణి, తహశీల్దార్ బాల్‌రెడ్డి, పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.

ఈ విషయం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు దృష్టికి వెళ్లడంతో ఆయన గ్రామీణవికాస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితంగా మేనేజర్‌కు రుణాలు రీ-షెడ్యూల్ చేయాలని ఫోన్‌లో ఆదేశాలు వచ్చాయి. దీంతో రీ-షెడ్యూల్ ప్రక్రియ చేపడతామని, గత కొన్ని రోజుల క్రితం రీ-షెడ్యూల్‌కు అర్హత వున్నా... రెన్యూవల్ చేయించుకున్నవారికి కూడా న్యాయం చేస్తామని మేనేజర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
Advertisement