యువకుడి వేధింపులకు యువతి బలి | Sakshi
Sakshi News home page

యువకుడి వేధింపులకు యువతి బలి

Published Fri, Jan 23 2015 4:06 AM

యువకుడి వేధింపులకు యువతి బలి - Sakshi

ఆదిలాబాద్ క్రైం : యువకుడి వేధింపులకు యువతి బలైంది. బెదిరింపులు తాళలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని టైలర్స్‌కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. టైలర్స్‌కాలనీకి చెందిన ఇందూర్ భూమన్న కూతురు కృష్ణవేణి(19) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఇదే కాలనీకి చెందిన వెంకట్‌నారాయణ అనే యువకుడు నాలుగేళ్లుగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. సదరు యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో సంచరిస్తుండగా కృష్ణవేణి చూసింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణవేణి ఈ నెల 19న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. కూతురు నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తండ్రి భూమన్న విషయం ఆరా తీసి స్థానిక రిమ్స్‌కు తరలించాడు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణవేణి పరిస్థితి విషమించి గురువారం చనిపోయింది.

తనను నాలుగేళ్లుగా వెంకట్‌నారాయణ వేధిస్తున్నాడని, తన చావుకు అతడే కారణమని నోట్‌బుక్‌లో రాసి పెట్టింది. దీంతో ఆ నోట్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు యువకుడి స్వస్థలం గుంటూరు కావడంతో ఇటీవల ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితమే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న ఇల్లు విక్రయించి సొంతూరుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

Advertisement
Advertisement