విశాఖ మదిలో ‘మావిచిగురు మాస్టారు’ | Sakshi
Sakshi News home page

విశాఖ మదిలో ‘మావిచిగురు మాస్టారు’

Published Tue, Mar 13 2018 11:21 AM

Senior actor Vankayala Satyanarayana passes away - Sakshi

మావిచిగురు తినగానే..కోయిల పలికేనా..
మావిచిగురు తినగానే..కోయిల పలికేనా..
కోయిల గొంతు వినగానేమావి చిగురు తొడిగేనా..
కోయిల గొంతు వినగానేమావి చిగురు తొడిగేనా..
ఈ పాట 1978లో వచ్చిన సీతామాలక్ష్మి చిత్రంలోనిది..ఈ పాటను..ఈ పాటలో సంగీత మాస్టర్‌గా అభినయించిన వంకాయల సత్యనారాయణ మూర్తిని సినీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఉగాది సందర్భంగా తెలుగునోట ఈ పాట ప్రతిధ్వనించాల్సిందే. అంతటి విశిష్టత కలిగిన ఈ గీతంలో ముఖ్యభూమిక పోషించిన వంకాయల సత్యనారాయణ సరిగ్గా మావిచిగురు తొడిగి కోయల పాట పాడే  రోజుల్లోనే అనంతలోకాలకు చేరడం యాదృచ్ఛికమో! దైవ సంకల్పమో! సరిగ్గా ఉగాదికి వారం రోజులు ముందు ఆయన దైవసన్నిధికి చేరుకున్నారు.

విశాఖ కల్చరల్‌: సహజ నటనకు వంకాయల సత్యనారాయణ పెట్టింది పేరు. ఏ క్యారక్టర్‌లోనైనా ఇమిడిపోతారు. అతని వాక్ఛాతుర్యం కూడా అద్భుతం. 250 చిత్రాలో నటించి మెప్పించారు. ఆ వెండితెర ముద్దు బిడ్డ పుట్టింది సాగరతీరాన్నే. విశాఖ గడ్డపై అగ్రశ్రేణి వ్యాపార కటుంబంలో పుట్టారు. నటనను ఆరో ప్రాణంగా భావించారు. నాటక రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఏడేళ్ల నుంచి విశాఖలోనే స్థిరపడి సాత్విక కార్యక్రమాల్లో పాల్గొంటూ  కళామతల్లి సేవలోనే కొనసాగారు. ఇలాంటి సీనియర్‌ నటుడు ఇక లేరు అనే విషయాన్ని విశాఖ కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

నటనే ఊపిరిగా..
వంకాయల కుటుంబం చాలా పెద్దది. ఆరుగురు అన్నదమ్ముళ్లు, నలుగురు అక్కచెల్లెళ్లు. 1940 డిసెంబరు 28న విశాఖ చావల వారివీధిలో రెండో సంతానంగా జన్మించిన వంకాయల ఏవీఎన్‌ కాలేజీలో విద్యనభ్యసిస్తూ, నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం సినిమాలే కాదు వంకాయల బహుముఖ ప్రతిభాశాలి. బీకామ్‌లో ఆయన గోల్డ్‌ మెడలిస్టు. క్రీడల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. 1960 ఎన్‌సీసీ రైఫిల్‌ షూటింగ్‌లో అంతర్జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం పొందారు. విద్యార్థి దశలోనే నాటకరంగంపై ఉన్న మక్కువతో నాటక కళాపరిషత్తులో చేరి రంగస్థల నటుడుగా రాణించారు. చదువు, ఆటల్లో ప్రతిభ కారణంగా హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ నటన అంటే ఇష్టంతో సినిమా రంగం వైపు అడుగులేశారు. 1976లో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. 250 తెలుగు చిత్రాల్లో నటించారు. 184 చిత్రాలు గొప్ప పాత్రల్లో మెప్పించడం సామాన్య విషయం కాదు. 1976 నుంచి 2000 వరకు చెన్నైలోనే ఉండేవారు. 2001లో మళ్లీ విశాఖనగరానికి వచ్చి గవర్నర్‌ బంగళా ఎదురుగా గల సీషెల్స్‌ ఎన్‌క్లేవ్‌లో వారి రెండో అమ్మాయి లావణ్య దగ్గర ఉంటున్నారు. సత్యనారాయణకు భార్య శకుంతల, పెద్ద కుమార్తె సుభద్రదేవి, రెండో కుమార్తె లావణ్య, ఇద్దరు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు, ఒక మునిమనవరాలు ఉన్నారు.

ప్రేక్షకుల మదిలో..
రంగస్థలం, వెండితెర, బుల్లితెరలపై ఆయన నటనా విశ్వరూపం చూపించారు. ఎన్నో హావభావాలు పలికించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సంభాషణల్లో ఏదో తెలియని మాధుర్యం ఉంటుంది. పూర్తిగా బేస్‌ వాయిస్‌. నీడలేని ఆడది, సినిమాతో ఆరగేంట్రం చేశారు. అప్పట్లో సినీ పరిశ్రమ మద్రాస్‌లో ఉండటంతో వైజాగ్‌ నుంచి చెన్నైకు మకాం మార్చేశారు.

తొలి..ఆఖరి శ్వాస సాగరతీరంలోనే..
మద్రాసులో ఉన్న వంకాయల సత్యనారాయణకు పుట్టిన ఊరంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన మనసు మళ్లీ విశాఖవైపు మళ్లింది. ఏడేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఎప్పటిలాగే నగరంలో కళాకారులను ప్రోత్సహిస్తూ పలు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. తోటి కళాకారుల్లో నూతనుత్తేజాన్ని కలిగించారు. నగరానికి చెందిన ఎందరో కళాకారులకు సినీ రంగానికి కూడా పరిచయం చేశారు. ఇటీవల గుణనిధి పేరిట కళాభారతిలో గొప్ప నాటిక ప్రదర్శించారు.

Advertisement
Advertisement