ప్రపంచంలోనే బలమైన అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా గెలుపొందిన మరునాడు డొనాల్డ్ ట్రంప్కు అనూహ్య హెచ్చరిక ఎదురైంది. మహిళలపై లైంగిక అకృత్యాల వ్యవహారంలో ట్రంప్ను కోర్టుకీడుస్తామంటూ అమెరికా పౌరహక్కుల యూనియన్ (ఏసీఎల్యూ) హెచ్చరించింది. ‘సీ యూ ఇన్ కోర్ట్’ (కోర్టులో కలుసుకుందాం) అని బోల్డ్ అక్షరాలతో రాసి ఉన్న ట్రంప్ ఫొటోను తన వెబ్సైట్ హోమ్పేజీలో బ్యానర్గా ఏసీఎల్యూ పెట్టింది. ట్రంప్పై తాము చేసే న్యాయపోరాటానికి అవసరమైన నిధులు విరాళంగా ఇవ్వాలని ప్రజలను కోరింది.
అత్యంత వివాదాస్పదంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పలు దుమారాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ట్రంప్ తమపై లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడని పెద్దసంఖ్యలో మహిళలు ముందుకొచ్చి ఆరోపించారు. మాజీ మిస్ యూఎస్ఏను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని, విమానంలో సహా ప్రయాణికురాలిని అసభ్యంగా తాకాడని, ట్రంప్ టవర్లో రిసెప్షనిస్ట్ను బలవంతంగా పెదవులపై ముద్దాద్దాడని, మహిళలపై అత్యంత దుర్మార్గంగా లైంగిక దుర్భాషలు చేశాడని లెక్కకు మించిన ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా 13 ఏళ్ల బాలికను ట్రంప్ రేప్ చేశాడంటూ ఓ కేసు కూడా కోర్టులో దాఖలైంది. అయితే, ఎన్నికల ఫలితాలకు ముందే ఈ పిటిషన్ డ్రాప్ అయింది. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు ఏసీఎల్యూ తెలిపింది.