'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో' | Sakshi
Sakshi News home page

'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో'

Published Thu, Sep 10 2015 8:36 AM

'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో' - Sakshi

బెంగళూరు: మరో కర్ణాటక రచయిత బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పటికే ప్రముఖ స్కాలర్ తత్వవేత్త అయిన ఎంఎం కాల్బుర్గి హత్య నుంచి అక్కడి ప్రజానీకం తేరుకోక ముందే అదే స్థాయికి చెందిన వ్యక్తి ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్కు ఓ బెదిరింపు లేఖ అందింది.

'ఆ లేఖ వచ్చిన మధ్యాహ్న సమయంలో నేను ఇంట్లో లేను. నా కుటుంబ సభ్యులు దానిని తీసుకున్నారు. ఆంగ్లంలో ఉన్న ఆ లేఖ చదివిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పుడది వారివద్దే ఉంది'  భగవాన్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మైసూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భగవద్గీతను చులకన చేసే వ్యాఖ్యాలు భగవాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ వర్గం నుంచి ఆయనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిసింది.

ఇంతకీ లేఖలో సారాంశం ఏమిటంటే.. 'ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాం. ఇప్పుడికి నీవంతే. ఏ పోలీసులు నిన్ను రక్షించలేదు. నీ గడువు ఇప్పటికే మించిపోయింది. ఇక రోజులు లెక్కపెట్టుకో' అని తీవ్ర వ్యాఖ్యలతో ఉంది. అయితే, ఇలాంటివాటికి తాను భయపడేది లేదని, తన గురించి పూర్తిగా తెలియని వారే ఈ లేఖ రాసి ఉంటారని అన్నారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి రచనలు చేసినా దాని వెనుక ఓ పరిశోధన, అధ్యయనం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement