ముంబై : త్వరలోనే సర్ ప్రైజ్ ఆఫర్ తో కస్టమర్ల ముందుకు రాబోతున్నట్టు టీజ్ చేసిన ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ ఆ ఆఫర్ ను ప్రకటించేసింది. ఎయిర్ టెల్ సర్ప్రైజ్ ఆఫర్ కింద తమ పోస్టు పెయిడ్ కస్టమర్లకు 30జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు వెల్లడించింది. మార్చి 13 నుంచి మూడు నెలల కాలం పాటు ఈ ఉచిత డేటా సేవలను ఎయిర్ టెల్ తన కస్టమర్లకు అందించనుంది. అయితే నెలకు 10జీబీ చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 30జీబీని ఉచితంగా కస్టమర్లు పొందుతారు. మార్చి 31 వరకు ఈ ఉచిత డేటాను కస్టమర్లు క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ఈ ఆఫర్ ను అందిపుచ్చుకోవడానికి ఎయిర్ టెల్ పోస్టు పెయిడ్ కస్టమర్లు గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ నుంచి 'మైఎయిర్టెల్' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ సర్ ప్రైజ్ ఆఫర్ ను క్లయిమ్ చేసుకోవడానికి ప్రమోటింగ్ యూజర్లకు ఈ యాప్ లో ఓ డైలాగ్ బాక్స్ చూపించనుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ ఉచిత డేటా సేవలు అందుబాటులోకి వస్తాయి. అదనపు డేటా సౌకర్యాలు కూడా టెక్ట్స్ మెసేజ్ ద్వారా కంపెనీ యూజర్లకు తెలియపరుస్తుంది. కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్స్ ను ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఈ టెలికాం దిగ్గజం సర్ ప్రైజ్ ఆఫర్ ను పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.345 ప్లాన్ పై రోజుకు 1జీబీ డేటాను వాడుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే పగలంతా 500ఎంబీ డేటా వాడుకున్న తర్వాత మిగతా 500 ఎంబీని మధ్యరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడుకోవాల్సి ఉంది. ఎలాంటి పరిమితులు లేకుండా రోజంతా 1జీబీ డేటాను వాడుకోవాలంటే రూ.549తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది.