లక్నో: ఒకవైపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్నా.. సమాజ్వాదీ పార్టీలో కుటుంబ నాటకం కొనసాగుతూనేఉంది..! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సోమవారం ఉదయం తండ్రి ములాయం సింగ్ ఇంటికి వెళ్లడంతో మరోఘట్టానికి తెరలేచింది. ఎన్నికల గుర్తుపై ఇరు వర్గాల పోరు, పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదల.. తదితర అంశాలపై తండ్రీకొడుకులు చర్చించినట్లు సమాచారం. నామినేషన్లకు గడువు తరుముకొస్తుండటంతో ఏదో ఒక ఫార్ములాపై రాజీ పడాలని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ ఫార్ములా ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్! (మీ నాన్న చాలా మొండోడు!)
సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తైన ‘సైకిల్’ కోసం ములాయం, అఖిలేశ్ వర్గాలు పలు దఫాలుగా ఎన్నికల సంఘాన్ని కలిశాయి. సోమవారం ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ములాయం.. విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో అంతా కలిసే ఉంటామని, కుటుంబంలో విభేదాల్లేవని స్పష్టీకరించారు. రాత్రి లక్నోలో నిర్వహించిన మరో సమావేశంలో ‘ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేశే’అని తేల్చిచెప్పారు. దీంతో నెలలుగా సాగుతోన్న నాటకానికి పెద్దాయనే తెరదించుతారనే సంకేతాలు వెలువడినట్లైంది. నేటి భేటీ అనంతరం రాజీ ఫార్ములాతోపాటు అభ్యర్థుల జాబితానూ ప్రకటించే అవకాశంఉంది.