కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి

Published Thu, Sep 26 2013 11:19 AM

కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించారు. ఒకే బృందంగా బయల్దేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. దీంతో నలుగురు పోలీసులు, ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం గమనార్హం. జమ్ము లోని సాంబ సెక్టార్‌లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే ఉగ్రవాదుల బృందం దాడులు చేసింది. ఆర్మీ యూనిఫాంలో ఆటోరిక్షాలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్‌ సరిహద్దుకు కిలోమీటర్‌ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్‌ స్టేషన్‌పై బాంబులు విసిరి, అనంతరం ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత  ట్రక్‌ డ్రైవర్ను హతమార్చి  ట్రక్కులో అక్కడినుంచి పారిపోయారు.

తర్వాత అదే తీవ్రవాదుల బృందం పఠాన్కోట్- జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ క్యాంప్‌ వద్దకు చేరుకుని అక్కడ కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారి, మరో ఏడుగురు జవాన్లు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరినట్లయింది. ఇరుపక్షాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫలితంగా జాతీయరహదారిని మూసేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement