గొంతు కోసి బంగారు నగల అపహరణ | Sakshi
Sakshi News home page

గొంతు కోసి బంగారు నగల అపహరణ

Published Wed, Oct 7 2015 11:46 PM

Assaults Gold jewelleries theft after split woman neck with knife

వరంగల్ అర్బన్: బంగారు నగల కోసం ఇంట్లో ఉన్న ఓ గృహిణిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో బుధవారం ఈ ఘటన జరిగింది. మాసూంఅలీ పాఠశాల వీధిలో ఇమ్మడి శ్యాంసుందర్-జ్ఞానేశ్వరీ (56) దంపతులు నివసిస్తున్నారు. శ్యాంసుందర్ ఉదయం 8 గంటలకు పల్లీ గింజల మిల్లు దగ్గరకు వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరింట్లో పనిచేసే వాణి వచ్చి తలుపు తట్టగా... యాజమానురాలు జ్ఞానేశ్వరి తలుపు తీయలేదు.

కిటీకీలోంచి చూడగా జ్ఞానేశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది. విషయూన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లో కిరాయిదారులకు చెప్పగా, వారు యాజమాని శ్యాంసుందర్‌కు ఫోన్ చేసి చెప్పారు. హూటాహుటిన శ్యాంసుందర్ ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే జ్ఞానేశ్వరి మతి చెందింది. పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగుడు జ్ఞానేశ్వరి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రతిఘటించినట్టు సంఘటనా స్థలాన్నిబట్టి అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement