ఓటుకు కోట్లు కేసు: చార్జిషీటులో చంద్రబాబు పేరు | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసు: చార్జిషీటులో చంద్రబాబు పేరు

Published Mon, Aug 17 2015 8:58 PM

cash for vote: chandrababu named in chargesheet

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లోపడ్డారు. ఏసీబీ మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరును చేర్చారు. చార్జిషీటులో పలుమార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించినట్టు సమాచారం.  ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు  చార్జీషీటులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపులిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్.. స్టీఫెన్ సన్తో మాట్లాడిన సంభాషణలు బహిర్గతమయ్యాయి. అంతేగాక ఆడియో రికార్డులు కూడా వెల్లడయ్యాయి. రేవంత్ పలుమార్లు 'బాస్' అని సంబోధించారు. ఈ బాస్ ఎవరన్నదానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉదయ సింహా, సెబాస్టియన్ తదితరులను నిందితులుగా చేర్చారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు పలువురు టీడీపీ నేతలను, వారి వద్ద పనిచేసేవారిని విచారించారు.

స్టీఫెన్ సన్తో చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బహిర్గతమైన విషయం విదితమే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు చంద్రబాబు.. స్టీఫెన్తో మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్.. స్టీఫెన్కు ముడుపులిస్తూ దొరికిపోయారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్ స్టీఫెన్ను ప్రలోభపెట్టారు. కాగా స్టీఫెన్తో మాట్లాడిన విషయంపై చంద్రబాబు పెదవి విప్పలేదు. జాతీయ మీడియా ప్రతినిధులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.

Advertisement
Advertisement