జగన్ పేరు చెబితేనే చంద్రబాబుకు వణుకు: భూమన కరుణాకరరెడ్డి | Sakshi
Sakshi News home page

జగన్ పేరు చెబితేనే చంద్రబాబుకు వణుకు: భూమన కరుణాకరరెడ్డి

Published Sat, Sep 14 2013 2:23 AM

జగన్ పేరు చెబితేనే చంద్రబాబుకు వణుకు: భూమన కరుణాకరరెడ్డి - Sakshi

సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెబితేనే గుండెల్లో వణుకు పుడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే ఆయనపై ఎల్లో మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భూమన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.  జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయినట్లు ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఇది దొంగతనం చేస్తున్న వ్యక్తే దొంగ దొంగని అరిచినట్లుగా ఉందని విమర్శించారు.
 
 ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక పార్టీ టీడీపీ అనే విషయం బహిరంగ రహస్యమని చెప్పారు. జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందుకే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్న విషయాన్ని తెలుసుకుని, చంద్రబాబు బస్సుయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని మరీ ఢిల్లీకి వెళుతున్నారని తెలిపారు. చీకట్లో చిదంబరంను కలుసుకుని జగన్ బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు కుటిల యత్నాలకు కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

Advertisement
Advertisement