విద్యార్థిని.. కంపాస్‌తో పొడిచి చంపేశారు! | Sakshi
Sakshi News home page

విద్యార్థిని.. కంపాస్‌తో పొడిచి చంపేశారు!

Published Tue, May 2 2017 8:13 AM

విద్యార్థిని.. కంపాస్‌తో పొడిచి చంపేశారు!

దేశ రాజధాని నగరం నేరాలకు కూడా రాజధానిగా మారుతోంది. పశ్చిమ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో 11వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతడి జామెట్రీ బాక్సులో ఉన్న కంపాస్‌తోనే గుండెల్లో పొడిచి చంపేశారు. ఆ బాలుడు పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో గల వేద వ్యాస డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. తన కుటుంబంతో కలిసి వికాస్‌పురి ప్రాంతంలోనే ఉంటాడు. స్కూలుకు 10 కిలోమీటర్ల దూరంలో అతడి హత్య జరిగింది. దీనపై చావ్లా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కొంతమంది పిల్లల మధ్య జరిగిన గొడవ వల్లే ఈ హత్య జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గోయ్లా డెయిరీ సమీపంలో ఉన్న ఓ డ్రెయిన్‌ వద్ద మధ్యాహ్నం 3.3. గంటల సమయంలో పిల్లవాడి ఏడుపు వన్ని స్థానికులు అక్కడకు వెళ్లి చూశారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దాంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన అక్కడకు  చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. కొంతమంది పిల్లలు అక్కడినుంచి పారిపోతుండగా పోలీసులు చూశారని స్థానికులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా విచారిస్తున్నట్లు డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు. అదే స్కూలుకు చెందిన కొంతమంది పిల్లలను కూడా విచారిస్తున్నామన్నారు. తన తండ్రి తన కోసం వచ్చారని చెప్పి స్కూలు నుంచి బయటకు వెళ్లాడని ఆయన చెప్పారు. తర్వాత అతడు ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్ మీద వెళ్తుండగా కొంతమంది చూశారన్నారు. దాంతో ఈ కేసులో ఏం జరిగిందో క్షుణ్ణంగా విచారించాల్సి ఉందన్నారు.

Advertisement
Advertisement