సీఎంఓ జాయింట్ సెక్రటరీగా రాజమౌళి | Sakshi
Sakshi News home page

సీఎంఓ జాయింట్ సెక్రటరీగా రాజమౌళి

Published Tue, Aug 25 2015 2:05 AM

CMO Joint Secretary As Rajamouli

* సీఎం కార్యాలయం నుంచి వెంకయ్య చౌదరి బదిలీ
* ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి వి.రాజమౌళి ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. 2003 బ్యాచ్‌కు చెందిన రాజమౌళి ఉత్తరప్రదేశ్ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ఇతర రాష్ట్రాల కేడర్ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసుకు వచ్చిన ఐఏఎస్, ఐఆర్‌ఎస్ సర్వీసుకు చెందిన నలుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ, మరో ఏడుగురు అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న వెంకయ్య చౌదరిని రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన వెంకయ్య చౌదరిని సీఎం కార్యాలయం నుంచి బదిలీ చేయడంతో ఆ స్థానంలో రాజమౌళిని నియమించారు. వెంకయ్య చౌదరి సీఎం కార్యాలయ ఓఎస్‌డీగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టే అంశాన్ని పర్యవేక్షించేవారు.ఇప్పుడు రాజమౌళికి అవే బాధ్యతలతోపాటు మరికొన్ని బాధ్యతలను అప్పగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నరేశ్ పెనుమాకను చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ఎండీగా నియమించారు. జి.ఎస్.ఫణికిషోర్‌ను ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. కేవీ సత్యనారాయణను జీఏడీ (ప్రొటోకాల్) సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కె.ధనుంజయ రెడ్డిని వ్యవసాయ శాఖ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డెరైక్టర్ బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా కట్టబెట్టారు.

Advertisement
Advertisement