పార్టీపై తీవ్ర స్థాయిలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ మీడియా మేనేజర్ల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... మౌనం పాటించకుండా.. సరియైన సమాచారంతో ప్రతిపక్షం, మోడి విమర్శలపై ప్రతిదాడి చేయాలి అని అన్నారు. జిల్లా స్థాయి నుంచి ఏఐసీసీ స్తాయి వరకు నేతలంతా ఒకే తాటిపై ఉండి దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని రాహుల్ సూచించారు.
ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 32 మంది మీడియా చీఫ్ లతో సమావేశం నిర్వహించారు. ఫేస్ బుక్, ట్విటర్, ఇతర ఇంటర్నెట్ సైట్లతోపాటు సోషల్ మీడియాపై అవగాహన కల్పించేందుకు అధికార ప్రతినిధులకు జవహర్ భవన్ లో ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనీష్ తివారీ, శశి థరూర్, ఏఐసీసీ మీడియా విభాగం చీఫ్ అజయ్ మాకెన్, ఎంపీ దిపేందర్ హుడాలు పాల్గొన్నారు.