క్వాలిఫైయింగ్ పేపర్‌గా సీశాట్ | Sakshi
Sakshi News home page

క్వాలిఫైయింగ్ పేపర్‌గా సీశాట్

Published Thu, May 14 2015 3:19 AM

csat as qualifying paper for civils

 సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్ష ప్రిలిమ్స్‌లో రెండో పేపర్ అయిన సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీశాట్)ను క్వాలిఫైయింగ్ పేపర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది.  సీశాట్‌ను రద్దుచేయాలని, దీనివల్ల తమకు అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ వివిధ రాష్ట్రాల ప్రాంతీయ, ఆర్ట్స్ సైన్స్ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సీశాట్‌లో గణితం, ఆంగ్లం, డెసిషన్ మేకింగ్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు అడుగుతుండడం, వాటిలో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకొని మెయిన్స్‌కు ఎంపిక చేయడం వల్ల ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యమున్నవారే లబ్ధి పొందుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, హ్యుమానిటీ సబ్జెక్టుల్నిబట్టి పరీక్షలు రాసే వారు నష్టపోతున్నారు. మొదటి పేపర్లో ఎక్కువ మార్కులొచ్చినా రెండో పేపర్ అయిన సీశాట్‌లో ఐఐటీ, ఐఐఎం తదితర అభ్యర్థులకంటే తక్కువ మార్కులొస్తుండడంతో మెయిన్స్‌కు అర్హత కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీశాట్‌ను కంపల్సరీ అని కాకుండా క్వాలిఫైయింగ్ పేపర్‌గా కేంద్రం మార్చింది. ఈ పేపర్లో 33 శాతం మార్కుల్ని క్వాలిఫైయిం గ్‌కు నిర్దేశించారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీశాట్ వల్ల ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన కృషి ఫలించింది. ఆర్ట్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థులలతోపాటు  వివిధ ప్రాంతీయ భాషా విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్న విషయాన్ని ఆ పార్టీ ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement